AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధిచడంతో, ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. సీమన్స్ సంస్థ పేరు వాడుకుని గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు పేరుతో రూ.279 కోట్ల రూపాయలు దారి మళ్లించారని సీఐడీ కేసు నమోదు చేసింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు దారి మళ్లాయని దీనిలో చంద్రబాబు పాత్ర ఉందనేది అభియోగం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో స్కిల్ డవలప్ మెంట్ ప్రాజెక్టుపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.
వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దానికి చంద్రబాబుదే కీలక పాత్ర అని కథనాలు వస్తుండగా, టీడీపీ అనుకూల మీడియాలో అసలు స్కామ్ యే జరగలేదనీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న ఆరోపణలను ఖండించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు బోగస్ అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్టుని బోగస్ అనడం సరికాదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
తనపైనా తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని అన్నారు సుమన్ బోస్. మార్కెటింగ్ లో భాగంగానే 90 : 10 ఒప్పందం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని ఆయన పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్ మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. 2021 నాటికి 2.32 లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఈ సెంటర్ల ద్వారా నైపుణ్యం సాధించారని తెలిపారు. వారికి సర్టిఫికెటేషన్ ఇవ్వడంతో ఉద్యోగుల కూడా చేస్తున్నారని అన్నారు.
2016లో విజయవంతమైన ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందన్నారు సుమన్ బోస్. 2021 లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ప్రాజెక్టు అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలన్నారు. 2021 లో స్కిల్ డెవలప్ మెంట్ బాగా జరిగిందని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా లెటర్ కూడా అందుకున్నామని చెప్పారు. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్ అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపలేదన్నారు. ఇదే తరహా ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశామని చెప్పారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు కోర్టులకు చెబుతామని ఆయన తెలిపారు.