స్పీకర్ కోడెల మరో సారి గీత దాటేశారు…శాసన సభ స్పీకర్ గా అధికార,ప్రతిపక్ష పార్టీల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతి కోడెల ఆ నైతిక ధర్మాన్ని పాటించడంలో మళ్లీ విఫలమయ్యారు. సభాపతిగా ఎన్నుకోబడేవారు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అయినా ఒక్కసారి ఆ స్థానం స్వీకరించిన తరువాత రాజకీయాలు పక్కన పెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలి. భారతదేశం 1950 జనవరి 26 న సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము ఆవిర్భవించిన తరువాత ఏర్పడిన ఇటీవలికాలం వరకు చట్టసభల విషయంలో సభాపతులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి తమ పదవికి న్యాయం చేశారు.
అయితే రాను రాను రాజకీయ పార్టీలకు అధికార సాధనే అన్నింటికంటే ముఖ్యంగా…సిధ్దాంతాలనేవి అప్రధాన అంశాలుగా మారిపోవడంతో సభాపతుల వ్యవహార శైలిలోను మార్పు కనిపించడం మొదలయింది. నిష్పాక్షికత స్థానంలో అధికార పార్టీ పట్ల కొంత పక్షపాత ధోరణి కనబర్చే ధోరణి ప్రారంభమైంది. అయితే అదంతా పరోక్షంగానూ ప్రతిపక్షాలు సైతం సూటిగా ఆరోపణలు, ఘాటుగా విమర్శలు చేయడానికి వీలులేని చందంగా…ఆ స్థాయిలోనే ఉంటూ వచ్చింది. అయితే గడచిన దశాబ్ద కాలంలో ఈ ధోరణి మరింత పెరిగిపోయి విజ్ఞులు విస్తుపోయేలా, సామాన్య ప్రజలు సైతం అర్ధం చేసుకునేలా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న తరహాలో
సభాపతులు వ్యవహరించడం పరిపాటిగా మారింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల ఒక అధికారిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను బట్టి సభాపతుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. శనివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో జరిగిన పసుపు కుంకుమ సంబరాలు, పింఛన్ల ఉత్సవాల్లో స్పీకర్ కోడెల
మాట్లాడుతూ…ప్రధాని మోదీ మోచేతి నీళ్లు తాగుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్రానికి అన్యాయం చేసిన భాజపాను నిట్టనిలువునా రాజకీయంగా పాతి పెట్టాలని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడతీసినా…రాజధాని లేకపోయినా…జీతాలకు కొరత ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన
పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని కోడెల చెప్పారు.
టిడిపి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే…ప్రతిదీ రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేవని…రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసిన ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి రావాలనుకుంటున్నారని కోడెల ప్రశ్నించారు.
అయితే రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిలో ఉండి దేశ ప్రధాని, ప్రతిపక్ష నేతపై కోడెల ఇంత బహిరంగంగా ఈ విధమైన విమర్శలు చేయడం…ముఖ్యమంత్రిని, అధికార పార్టీని ప్రస్తుతించడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ సభాపతి ఇంతగా అధికార పార్టీకి కొమ్ముకాసిన చందంగా వ్యవహరించలేదని గతంలో పరిస్థితులతో పోలికలు తెచ్చి విశ్లేషణలు చేస్తున్నారు. తెలుగు రాజకీయ నాయకుల్లో సీనియర్ అయిన స్పీకర్…అందరికీ పెద్ద దిక్కులా హుందాగా వ్యవహరించే కోడెల ఇప్పుడు ఇలా తాను ఉన్న రాజ్యంగబద్దమైన పదవిని, హోదాను, నైతిక బాధ్యతను మరిచి రాజకీయ ప్రయోజనాల పాకులాడటం అనేది సామాన్య ప్రజలకు సైతం స్పష్టంగా అర్థమవుతోంది.
2014 ఎన్నికల్లో టిడిపి విజయం అనంతరం శాసన సభ స్పీకర్ గా కోడెల పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య విషయంలో తీవ్ర జాప్యం, ప్రతిపక్ష సభ్యుల పట్ల కఠిన వైఖరి,స్పీకర్ అయి వుండి ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఇలా వివిధ సందర్భాల్లో సభాపతిగా కోడెల వ్యవహరిస్తున్న తీరు అటు ప్రతిపక్షాలే కాకుండా రాజకీయ పరిశీలకులు సైతం తప్పు బట్టేలా ఉంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన తాను సభాపతి అన్న విషయాన్ని తోసిరాజని ఒక సాధారణ రాజకీయ నాయకుడిలాగా తనదో, తన కుమారుడి సీటు విషయం వంటి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతూ తన పదవిని కించపర్చడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తన స్థాయిని తగ్గించుకుంటున్నారని రాజకీయ
విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.