గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నేడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. బాబుతో పాటు ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, జవహర్, పలువురు పార్టీ నేతలు కార్యాలయానికి వచ్చారు. నేటి నుంచి ప్రతి రోజూ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో టిడిపి ఘోర పరాజయం తరువాత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి రావడం ఇదే మొదటి సారి.
ముందుగా ఎన్టిఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుండే జరుగుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త కార్యాలయం సిద్ధం అయ్యే వరకూ ఇక్కడ నుండే కార్యక్రమాలు నిర్వహించడం సులభమని చంద్రబాబు అన్నారు. ఓట్లు వేసిన 40శాతం ప్రజల కోసం పని చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘టిడిపికి చారిత్రాత్మకత ఉంది. మళ్లీ మనపై బాధ్యతలు పెరిగాయి’ అని అన్నారు.
నీతి వంతమైన పాలన ఇచ్చామని చంద్రబాబు అన్నారు. మనపై నమ్మకంతో 33వేల ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటామనీ, అండగా నిలుస్తామని చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.