అమరావతి: వివాదాస్పద పోస్టులతో సోషల్ మీడియాలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని తాజాగా సంధించిన వ్యంగాస్త్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్విట్ చేస్తున్నాడు, దౌర్భాగ్యం!’ అంటూ కేశినేని ట్వీట్ చేశాడు.
గత కొద్ది రోజులుగా కేశినేని స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఈ తాజా పోస్టు ఎవరిని ఉద్దేశించి పోస్టు చేశారో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఇది లోకేష్ను ఉద్దేశించి చేసినట్లుగా పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కేశినేని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుండి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేశినేని క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి.