అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి టిడిపికి గుడ్బై చెప్పి బిజెపిలో చేరారు. వారం రోజుల క్రితమే టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్రెడ్డి టిడిపిని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నేత గంగుల ప్రతాపరెడ్డి కూడా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గంగులతో పాటు నెల్లూరు జిల్లా కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్, ఆదాయపన్ను శాఖ రిటైర్డ్ కమిషనర్ కంచర్ల హరిప్రసాద్, చిత్తూరు జిల్లా టిడిపి ఒబిసి సెల్ కార్యదర్శి డి వెంకయ్య తదితరులు బిజెపిలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడటంతో టిడిపిలోని కొందరు సీనియర్ నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులతో ప్రారంభమైన వలసల పర్వం కొనసాగుతోంది. 2024 ఎన్నికల నాటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయాలన్న లక్ష్యంలో ఆ పార్టీ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో బిజెపికి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. మంగళగిరిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనిపించదని జోస్యం చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి బిజెపిలోకి అనేక మంది వచ్చి చేరుతున్నారని మాణిక్యాలరావు అన్నారు.