అమరావతి: రాష్ట్రంలో మరో ఇద్దరికి క్యాబినెట్, ఆరుగురుకి సహాయ మంత్రుల హోదా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ విప్లకు క్యాబినెట్, విప్లకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని భావిస్తున్నారు.
మంత్రులుగా అవకాశం లభించని వారికి ప్రత్యామ్నాయంగా మంత్రి హోదా దక్కిస్తూ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ, శాసనమండలిలో ఇద్దరు చీఫ్ విప్లకు క్యాబినెట్ ర్యాంక్, ఆరుగురు విప్లకు సహాయ మంత్రి హోదా దక్కనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుండి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలవటంతో అనేక మంది సీనియర్ నేతలు కేబినెట్లో చోటు లభిస్తుందని ఆశించారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణల నేపథ్యంలో అనుభవం, అర్హత, విధేయత ఉన్నా మంత్రి పదవుల్లో స్థానం కల్పించలేకపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన మంత్రివర్గంలో
ఏకంగా అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.
మంత్రి పదవుల్లో స్థానం కల్పించలేని పలువురు సీనియర్ నాయకులను బుజ్జగిస్తూ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరుస్తున్నారు. రెండున్నరేళ్లకు మళ్లీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావహులకు ముందుగానే జగన్ చెప్పారు.