తూర్పు గోదావరి జిల్లాకు దళిత యువకుడు వరప్రసాద్కు శిరోముండనం ఉదంతం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్లో
చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. అయితే, ఈ ఎపిసోడ్లో ఏపీ మంత్రి విశ్వరూప్ చేసిన కామెంట్లు సీఎం జగన్ను ఇరకాటంలో పడేశాయని అంటున్నారు.
వేదుల్లాపల్లె గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే దళిత యువకుడు వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా ముని కూడలి ప్రాంతంలో ఇసుక లారీలను ఆపడానికి ప్రయత్నించాడు. ఈ విషయమై విచారణ నెపంతో పోలీసులు అతడిని జూలై 20న సీతానగరం పోలీస్స్టేషన్కు పిలిచారు. ఆ తరువాత పోలీసులు తనను తీవ్రంగా కొట్టి, శిరోముండనం చేసి టార్చర్ పెట్టినట్లు వరప్రసాద్ పేర్కొన్నాడు.
కాగా, దళిత యువకుడి ఉదంతంలో మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించగా దానిపై విశ్వరూప్ రియాక్ట్ అయ్యారు. దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్ దుయ్యబట్టారు. కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి మంత్రి విశ్వరూప్ హితవు పలికారు. ఇదే సమయంలో నక్సలైట్లలో ఎవరైనా చేరవచ్చని మంత్రి విశ్వరూప్ మాట్లాడటం కలకలం రేపింది.
వైసీపీ నేతల చేతిలో అవమానానికి, అనంతరం శిరోముండనానికి గురైన బాధితుడు వరప్రసాద్ తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాన్నీ భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురై నక్సల్స్ లో చేరతానని రాష్టపతికి లేఖ రాయడమే అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది. ఇలాంటి సమయంలో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, అదే దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడిని నక్సల్స్ దళంలో చేరమని చెప్పడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న ఎదురవుతోంది. అన్యాయం జరిగితే న్యాయం చేయకపోగా హేళన మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉండగా, దళిత యువకుడికి అవమానం జరిగిన సంఘటనపై డీఐజీ దర్యాప్తు జరిపి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసు వివరాలను తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జూలై 22న అధికారులను ఆదేశించారు.