ఢిల్లీ : బిజెపికి ఒకే రోజు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేశారు. అస్సాంలోని తేజ్ పూర్ నియోజక వర్గ సిట్టింగ్ ఎంపి రామ్ ప్రసాద్ శర్మ శనివారం ఉదయం బిజెపికి రాజీనామా చేశారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్లోని అలహాబాద్ నియోజక వర్గ సిట్టింగ్ ఎంపి శ్యామా చరణ్ గుప్తా బిజెపికి గుడ్ బై చెప్పారు.
గుప్తా అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో గుప్తా ఎస్పీ తరఫున బాందా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
1999 లో ఇదే బందా నియోజవర్గం నుంచి మొదటి సారి గుప్తా ఎస్పీ తరుపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లో మాత్రం ఓటమిపాలయ్యారు. 2009 లో ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన గుప్తా ఓడిపోయారు.
2014 లో గుప్తా అలహాబాద్ నియోజవర్గం నుంచి బిజెపి తరుపున పోటీ చేసి గెలిచారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి మొట్టమొదటి జాబితాను విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు గుప్తా పార్టీ రాజీనామా చేశారు. గుప్తా రాజీనామా చేయటం ఎస్పీ, బీఎస్పీలకు కలిసొచ్చే అంశం.
బందా నియోజకవర్గంలో గత రెండు దశాబ్దాలుగా ఎస్పీ,బీఎస్పీ మధ్యే పోటీ నడుస్తున్నది. 2014 లో మాత్రం బిజెపి అభ్యర్థి గెలిచారు. వచ్చే ఎన్నిలకల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి గుప్తా బిజెపి అభ్యర్థిని మాత్రమే ఎదుర్కొనవలసి ఉంటుంది.
రామ్ ప్రసాద్ శర్మ పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్, వీహెచ్పిలలో 15 ఏళ్లు, బిజెపిలో 29 ఏళ్లు సేవ చేశానని ఆయన గుర్తు చేశారు. ‘ఇవాళ బిజెపిని వీడాను. అస్సాంలో బిజెపి పాత కార్యకర్తలను తలచుకొంటే నా గుండెల్లో ఎంతో బాధ కలుగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లు పాతవారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని’ ఆయన తన ఫేస్ బుక్ పోస్ట్లో ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర బిజెపి కమిటీ అస్సాంలోని 14 లోక్ సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపింది. ఆ జాబితాలో శర్మ పేరు లేదు. దీంతో దశాబ్దాలుగా పార్టీ కోసం కస్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన వారిని ఇప్పుడు పట్టించుకోవట్లేదనీ, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
2014 లో శర్మ మొట్ట మొదటి సారి తేజ్ పూర్ నుంచి పోటీ చేసి ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టారు.