హైదరాబాదు, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక పెద్ద కుట్రదాగి ఉందనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ విచారణ కోరుతూ శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య వెనుక కుట్రదాగి ఉందని అన్నారు.
తాను ఎస్పి, డిఐజితో మాట్లాడుతుండగానే ఇంటలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావు వారితో ఫోన్లో చాలా సార్లు మాట్లాడారనీ, కుట్ర వెనుక ఆయన పాత్ర ఉందని జగన్ ఆరోపించారు. ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్గా పని చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల విధుల నుండి డిజిపి, అడిషనల్ డిజిలను తొలగించాలని తాము వినతి ఇచ్చినా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదన్నారు.
వివేకానంద రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించారనీ, ఆయన ప్రచారం టిడిపికి భయం పుట్టించిందనీ జగన్ అన్నారు.
సిబిఐ విచారణకు ఆదేశించకపోతే కోర్టుకు వెళతామని జగన్ అన్నారు. కుట్ర ఎమీ చేయకుంటే సిబిఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు.
తన తండ్రి మరణంపైనా అనేక అనుమానాలు ఉన్నాయని జగన్మోహనరెడ్డి అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి ఈ కేనును అప్పగించాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.