దేశం మొత్తం ఇప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికలపై కన్నేసింది. బీజేపీని తట్టుకుని, అమిత్ షాని ఎదుర్కొని ఒక ప్రాంతీయ పార్టీ నిలబడగలదా..? లేదా..? అనేది తేలిపోనుంది. మొత్తానికి దేశ రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టత మాత్రం ఒక ఆరునెలల్లో వచ్చేస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు అంత ప్రాధాన్యత ఎందుకో లోతుగా చూద్దాం..!!
మమత కోటపై కాషాయం కన్ను..!!
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సారి మరింత ప్రత్యేకంగా మారాయి. దశాబ్దకాలంగా బెంగాల్ గడ్డపై తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మమత బెనర్జీ చేసిందే చట్టం, ఆమె మాటే శాసనంగా సాగుతుంది. మొదటి నుండి లెఫ్ట్ (సీపీఎం) చేతిలో ఉన్న ఈ రాష్ట్రం 2011 లో మమత చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు మమత చేతి నుండి బీజేపీ తీసుకునేలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అక్కడ గత రాజకీయాలకు భిన్నంగా బీజేపీ ఒకరకమైన స్ట్రాటజీలో వెళ్తుండగా.., మమత మరో రకమైన స్ట్రాటజీలో వెళ్తున్నారు. అయితే అన్నిటికంటే భిన్నంగా ఇక్కడ లెఫ్ట్ పార్టీల నేతలు కూడా పార్టీలు ఫిరాయిస్తుండడం పెద్ద మలుపు.
పాతికేళ్ళుగా బీజేపీకి సున్నాలే..!!
బీజేపీ ఈ రాష్ట్రంలో ఏ మాత్రం బలంగా లేదు. 1977 వరకు ఇక్కడ కాంగ్రెస్ కొంచెం హవా చాటగా.. ఆ తర్వాత నుండి 2011 వరకు లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలో ఉండేది. వరుసగా ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా లెఫ్ట్ పార్టీలదే విజయం. కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమయ్యేది. అటువంటి దశలో మమత బెనర్జీ 2011 లో లెఫ్ట్ పార్టీల నుండి అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. 2016 లో కూడా ఆమె గెలిచి, ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. మొదటి నుండి ఏమాత్రం ఓట్ బ్యాంకు లేని బీజేపీ ఈసారి ఇక్కడ తిష్ట వేయాలని చూస్తుంది. మొత్తం 294 శాసనసభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 1996 నుండి ఓ సారి చూసుకుంటే..!
* 1996 ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి 203 స్థానాలు గెలవగా.., కాంగ్రెస్ పార్టీ 82 స్థానాలు గెలిచింది. మిగిలిన స్థానాలు చిన్న పార్టీలు గెలిచాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు సున్నా.., ఓట్లు 6 శాతం మాత్రమే.
* 2001 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల కూటమి 150 స్థానాలు గెలుచుకోగా.., కాంగ్రెస్ 26 స్థానాలు గెలిచింది. మొదటిసారిగా పోటీలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ మమత 60 స్థానాలు గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు సున్నా.., ఓట్లు 4 శాతం మాత్రమే.
* 2006 ఎన్నికల్లో మళ్ళీ లెఫ్ట్ కూటమిదే అధికారం.లెఫ్ట్ వాళ్ళు 176 స్థానాలు గెలుచుకోగా.., కాంగ్రెస్ 23 , తృణమూల్ 34 స్థానాలు గెలిచారు. బీజేపీ కి సున్నా సీట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్లు 5 శాతం మాత్రమే.
* 2011 లో పరిస్థితి మారింది. లెఫ్ట్ పార్టీలకు 42 స్థానాలు, కాంగ్రెస్ కి 45 స్థానాలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ మమత కి 190 స్థానాలు వచ్చాయి. ఆ కూటమి ఏకపక్షంగా విజేతగా నిలిచి తొలిసారిగా మమత సీఎం అయ్యారు. బీజేపీకి వచ్చిన సీట్లు సున్నా.., ఓట్లు 7 శాతం మాత్రమే.
* 2016 లో మళ్ళీ మమత హవా నడిచింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ కి 211 స్థానాలు, కాంగ్రెస్ కి 44 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకు 26 స్థానాలు వచ్చాయి. బీజేపీ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఈ పార్టీకి 10 శాతం ఓట్లు, 3 సీట్లు వచ్చాయి.
ఇప్పుడు లెక్కలు మారాయ్..!
గడిచిన పాతికేళ్లుగా లెక్కలు చూసాం. లెఫ్ట్ పార్టీలు అక్కడ ఎంతగా తిష్ట వేసాయి, మమత బెనర్జీ ఎంతగా పాతుకుపోయారో చూసాం. ఎన్నడూ లేని విధంగా 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. దీంతో మమతకు గట్టి పోటీ మొదలయింది. ఇప్పుడు బీజేపీ పక్కా ప్రణాళికతో వెళ్తుంది. ఒక్కసారి కూడా బెంగాల్ లో కనీసం 10 స్థానాలు కూడా గెలుచుకొని బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 170 సీట్లు టార్గెట్ పెట్టుకుంది. మమత కూడా తాను వరుసగా మూడోసారి గెలిచి తన పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకరకంగా మమతకి ఈ ఎన్నికలు చావో రేవో పరిస్థితి. ఆమె ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్తుని బీజేపీ పూర్తిగా అంధకారం చేసేస్తుంది. దేశంలో ప్రాంతీయ పార్టీల్లో కాస్త బలంగా ఉన్న మమత గనక ఈసారి బెంగాల్ లో ఓడితే దేశం మొత్తం ప్రాంతీయ పార్టీల భవిత ఆలోచించుకోవాల్సిందే..! అందుకే అక్కడ మమత తన రాజకీయం బలం తోడుగా ప్రశాంత్ కిషోర్ (పీకే)ని నమ్ముకున్నారు. X ఇటు అమిత్ షా తీవ్రంగా ప్రత్యేక టీమ్ తో బెంగాల్ లో పావులు వేస్తున్నారు. ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుంది..!! (బెంగాల్ రాజకీయాలు, ఎన్నికల విశేషాలు, విశ్లేషణలు మరిన్ని “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది..!!