విభజన జరిగిన తర్వాత సరిగ్గా 2014 ఎన్నికల ప్రచారానికి ముందు మార్చి నెలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అప్పట్లో సెన్సేషనల్ సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ-బీజేపీ కూటమితో చేతులు కలిపి 2014 ఎన్నికలలో పోటీచేసి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఆ పొత్తు సరిగ్గా 2019 ఎన్నికలకు ఏడాది ముందు వరకు కొనసాగించి తర్వాత బిజెపి టిడిపి కూటమి నుండి బయటికి వచ్చేశారు పవన్. ఆ తర్వాత సొంతంగా మొట్టమొదటిసారి 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల జర్నీ ఇప్పటి వరకు చూస్తే పార్టీని నిర్మించే విషయంలో దృష్టి పెట్టకుండా కేవలం ప్రత్యర్థులను విమర్శించడానికి అన్నట్టు రాజకీయాలు చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే తప్పు ఏపీలో బీజేపీ చేస్తుంది అనే టాక్ పరిశీలకుల నుండి వస్తుంది. పూర్తి విషయంలోకి వెళితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తరువాత నుండి చాలా వరకు బిజెపి ప్రత్యర్థులను విమర్శించడానికి అన్నట్టు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. పార్టీకి సరైన క్యాడర్ లేకుండా ఎంతసేపు పవన్ మాదిరిగా ప్రత్యర్థుల పై విమర్శలు చేయటం వల్ల వచ్చే లాభాలు ఏమీ ఉండవని… క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మానేసి ఇతర పార్టీ నాయకులను మాత్రమే పార్టీలో జాయిన్ చేసుకునే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పోనీ వస్తున్న నేతలతోపాటు బిజెపి లోకి వారి అనుచరులు వస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ నేతలు నాయకులను జాయిన్ చేసుకోవడం, ప్రత్యర్థులను విమర్శలు చేయటం పైనే దృష్టి పెట్టి ముందుకు సాగితే ఏపీలో 2019 ఎన్నికల సీన్ రిపీట్ అవటం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీ టిడిపి కొద్దిగా పట్టు తప్పింది. ఈ టైంలో కనుక బీజేపీ సరైన రీతిలో రాజకీయ ఎత్తుగడలతో.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తే ఏపీలో బీజేపీ కీలక స్థానాలు రాబట్టే అవకాశం ఉందని పరిశీలికుల టాక్.