ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఉద్యోగస్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించారు. ఇటీవల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు విధిగా మాస్కులు ధరించేలా గ్రామ పంచాయతీ సిబ్బంది బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఇందుకు సంబంధించి గ్రామ వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవచ్చని వారి నిరంతర పర్యవేక్షణ తో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారో లేదో క్షుణ్నంగా గమనించాలని తెలిపారు. ఎవరైనా మాస్కు ధరించకుండా కనబడితే వారికి అవగాహన కల్పించే రీతిలో కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ స్థాయిని బట్టి పది రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఫైన్ విధించవచ్చు.
ఆ తర్వాత జరిమానా రుసుమును తిరిగి పారిశుద్ధ్యానికి వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఒక మాస్క్ ధరించడం మాత్రమే కాదు సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత పరిశుభ్రత పై గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేరీతిలో మైక్ లో సూచనలు ఇవ్వాలని తెలిపారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి దిశ దశ నిర్దేశం చేశారు.