రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. గడిచిన రెండు నెలల నుంచి మీడియాలోనూ, వైసిపి వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా ఉన్న కృష్ణంరాజు వార్తలు రోజు రోజుకి నానారకాలుగా హల్ చెల్ చేస్తూనే ఉన్నాయి. వైసీపీ వ్యవహారాలు ఎంతో కొంత అంతర్గతంగా తెలిసిన ఆయన ఏ రోజు ఏ బాంబు వేస్తారో అనే ఆందోళన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ లు పెట్టడం, రోజుకో రకమైన విమర్శ చేయడం చివరలో ముఖ్యమంత్రి జగన్ అంటే తనకు అభిమానమని, పార్టీ అంటే గౌరవం అని చెప్పి ముగించడం రఘురామ కృష్ణంరాజు అలవాటుగా మారింది. తాజాగా వాలంటీర్ ల వ్యవస్థ సరిగా పని చేయడం లేదని, విచారణ చేయించాలని ఢిల్లీ వేదికగా అయన కోరారు.
అయన ఏమన్నారంటే..
కరోనా కేసుల సంఖ్య పెరుగుదల, కరోనా మరణాల నమోదులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం అన్నట్లుగా విమర్శించారు రఘురామ కృష్ణంరాజు. కరోనా ప్రారంభంలో వైరస్ వ్యాప్తి కట్టడికి వాలంటీర్ ల వ్యవస్థ చాలా బాగా పని చేస్తోందని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతుండటంపై ఎవరిని బాద్యులు చేస్తారని ప్రశ్నించారు. కరోనా కేసుల రికవరీలో రాష్ట్రం చాలా వెనుక బడి ఉందన్నారు. కరోనా తగ్గేందుకు వాలంటీర్ ల వ్యవస్థ కారణం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఆ వ్యవస్థ పై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో రిటైర్ ఉద్యోగుల పెన్షన్ ల చెల్లింపులు ఆలస్యం అయ్యాయని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారని చెబుతూ..ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి ఈ విధంగా ఉంటే విశాఖ, కర్నూలు నగరాలను రాజధానులుగా ఎలా అభివృద్ధి చేస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశంbపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో సవాల్ చేయడం సరైన చర్య కాదని అన్నారు రఘురామ కృష్ణంరాజు.
రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచిన కొద్ది నెలల నుండే తేడాగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే పార్టీ స్టాండ్ కు భిన్నంగా అయన లోక్ సభలో మాతృభాష పరిరక్షణపై మాట్లాడారు. అదే విధంగా లోక్ సభ ప్రవేశ ద్వారం వద్ద ప్రధాని మోడీ అయన రాజుగారు అంటూ ప్రత్యేకంగా పిలవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మళ్ళీ అయన బీజేపీకి దగ్గర అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనంతరం పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్..రఘు రామ కృష్ణం రాజుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ తరుణంలోనే తొలుత తన నియోజకవర్గం పరిధిలోని ఇసుక సమస్య, భూముల కొనుగోళ్లలో అవినీతి జరుగుతోంది, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు. అయన చర్యలపై పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజ్ నోటిస్ ఇస్తే దానిపై వ్యంగ్యంగా ఆరోపణలు చేశారు. ఆ తరువాత రఘు రామ కృష్ణం రాజు దూకుడు పెంచారు. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ, మరో పక్క సొంత పార్టీ నేతలతోనే తనకు ప్రాణభయం ఉందని, కేంద్ర భద్రత సిబ్బందితో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాను కలిసి కోరి సాధించుకున్నారు. సీఎం జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆరోపిస్తూ తమ నాయకుడిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని అందుకే మీడియా ద్వారా విషయాలు వెల్లడిస్తున్నాని అయన సమర్ధించుకున్నారు. చాలా విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదని, సీఎంఒ లో ఒ అధికారి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలోనూ పార్టీ స్టాండ్ కు భిన్నంగానే రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు.