అమరావతి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
కియో కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని విజయసాయి రెడ్డి విమర్శించారు. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘దొంగ ఏడుపులు వద్దు. యువ సిఎంకు ఏం చేయాలో తెలుసు. కియో పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగుతుంది‘ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
అఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్లు అవినీతికి పాల్పడిందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
నక్కల రోడ్డులోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల రూపాయ లోపే అద్దె చెల్లించేవారనీ, దాన్ని 30లక్షల రూపాయల అద్దె బిల్డింగ్లోకి మార్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ అని ప్రశ్నించారు.
‘ఉన్నత విద్యామండలిలో నలుగురికి డ్రైఫూట్స్ ఖర్చు 18లక్షల రూపాయలంట. విజనరీ, అనువజ్ఞుడు, అభివృద్ధి పదగామి అని కులమీడియా కీర్తించింది ఈయననే’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.