కాకినాడ : చంద్రబాబు పార్టీ 2014 ఎన్నికల్లో కేవలం లక్ష ఓట్ల తేడాతో మనపై గెలిచిన సంగతి గుర్తుంచుకుని ఈ ఎన్నికల్లో కష్టపడి పార్టీ గెలుపునకు కృషి చేయాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు పరిపాలనలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అధికారంలోకి వస్తే మీ బాగోగులు నేను చూసుకుంటాను’ అని జగన్ హామీ ఇచ్చారు. మీ మీద పెట్టిన కేసులను ఎత్తివేస్తానని భరోసా ఇచ్చారు. జగన్ సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసిపి నిర్వహించిన సమరశంఖారావం సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తాము అధికారంలోకి వస్తే పార్టీలకు, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తామని జగన్ అన్నారు . అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తామని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబుపై ఈ సందర్భంగా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారని చెప్పిన జగన్..నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టారని విమర్శించారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాని అమలు సరిగా లేదు. 87 వేల కోట్ల రూపాయల రుణాలు ఉంటే 24 వేల కోట్లకు కుదించారు. ఆ మాఫీకి సంబంధించి ఇంకా నాలుగో విడత, ఐదో విడత జమ కాలేదు’ అని జగన్ అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది తీసుకున్న రుణాలకు వడ్డీలకు కూడా చాల్లేదని జగన్ పేర్కొన్నారు.
టిడిపి చేస్తున్న మోసాలను, అరాచకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. టిడిపి మానిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల పరిస్థితి ఏమిటనే దానిపై కూడా చర్చ జరగాలని జగన్ అన్నారు.
రాజధాని గ్రాఫిక్స్ తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదని జగన్ విమర్శించారు. రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించారు. అందులో 40 వేల ఎకరాల్లో గడ్డి తప్ప ఇంకేం లేదని జగన్ అన్నారు. అన్నీ తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని జగన్ అన్నారు.
చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడని జగన్ వ్యాఖ్యానించారు. తమకు ఓటు వేయరు అనుకుంటే తొలగిస్తారని జగన్ ఆరోపించారు. మన ఆధార్ కార్డులు , బ్యాంకు ఆకౌంట్ల వివరాల్ని దొంగిలించి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటానికి ముఖ్యమంత్రి ఎవరు అంటూ గ్రామాల్లో చర్చ పెట్టమని జగన్ కార్యకర్తలకు సూచించారు.
ఫామ్-7 అంటే దొంగ ఓటుపై ఇచ్చే ఒక దరఖాస్తు. ఎన్నికల సంఘం పరిశీలించి న్యాయం చేస్తుంది. ఆ దరఖాస్తు పెడితే ఓట్ల తొలిగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫారం- 7 ఇచ్చారని వైసిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంట్లో ప్రతి ఒక్కరి ఓటు ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ చంద్రబాబు గనుక ఓట్లు తొలగించి ఉంటే మళ్ళీ చేర్పించుకోండి. మార్పులు చేర్పులకు మనకి ఇంకా ఐదు రోజులే సమయం ఉంది అని జగన్ అన్నారు.
వైసిపి అధికారంలోకి వస్తే మీ పిల్లల చదువుకోసం ఎన్ని లక్షల ఖర్చైనా నేను చదివిస్తా అని జగన్ అన్నారు. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటే ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తామని జగన్ అన్నారు. చిన్న పిల్లలను స్కూలుకి పంపిన తల్లులకు ఏడాది 15వేల రూపాయలు అదజేస్తామన్నారు.
వైఎస్సార్ చేయూత కింద మహిళలకు నాలుగు దఫాలుగా 75వేల రూపాయాలు ఇస్తామన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు నాలుగు దఫాల్లో మాఫీ చేస్తామన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతుకు 12,500 రూపాయలు అందజేస్తామన్నారు. రెండు వేల పింఛన్ ను మూడు వేలు చేస్తామని జగన్ పలు హామీలిచ్చారు.