పెద్ద నోట్లు రద్దయిన సమయంలో నోట్లు డిపాజిట్ చేసేందుకు
బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలు (ఫైల్ ఫొటో)
పెద్ద నోట్లు రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు అభ్యంతరం చెప్పింది. తర్వాత ‘ప్రజా ప్రయోజనాల రీత్యా’ అంగీకరించింది. ఇంతవరకూ తెలియని ఈ విషయం తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది.
2016 నవంబర్ ఎనిమిదిన మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్త టెలివిజన్ ప్రసంగ ప్రసారం ద్వారా ప్రకటించారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయినందువల్ల దేశం మొత్తం మీద చలమణీలో ఉన్న కరెన్సీలో 80 శాతం ఒక్క దెబ్బతో పనికి రాకుండా పోయింది.
మోదీ ప్రకటనకు కొద్ది గంటల ముందు రిజర్వు బ్యాంకు డైరక్టర్ల బోర్డు సమావేశమయింది. బోర్డు ఆమోదం లేకుండానే మోదీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. తర్వాత ఎప్పుడో డిసెంబర్ 16న బోర్డు ఆమోదం ప్రభుత్వానికి అందింది.
రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం మినిట్స్ ప్రకారం పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదనకు మోదీ ప్రభుత్వం చెప్పిన కారణాలలో చాలావాటిని బోర్డు తోసిపుచ్చింది. ఉదాహరణకు దొంగనోట్ల చలామణీ సమస్యే అయినప్పటికీ దేశం మొత్తం మీద చలామణీలో ఉన్న నగదుతో పోలిస్తే 400 కోట్ల రూపాయలు పెద్ద మొత్తం కాదని బోర్డు అభిప్రాయపడింది. ఇక నల్లధనం విషయానికి వస్తే ఎక్కువ శాతం నల్లధనం నగదు రూపంలో కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్ రూపంలో ఉంది కాబట్టి పెద్ద నోట్ల రద్దు దానిపై పెద్ద ప్రభావం చూపదని బోర్డు పేర్కొన్నది. ఆర్టిఐ ద్వారా ఈ సంగతులు వెలుగులోకి వచ్చినట్లు ఎన్డి టివి తెలిపింది.