Bandi Sanjay: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా కొట్లాడితే బీఆర్ఎస్ లాభపడుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని పేర్కొంటూ .. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకుండా ఉండేందుకు తమకు సహకరించాలని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజార్టీతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించలేదన్నట్లుగా చాలా రోజులుగా వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా చేస్తారని అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కేటిఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగవచ్చొని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద నెట్టివేస్తారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ముందుగా బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని అన్నారు. బీజెపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే ప్రజలు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గుడ్డి ఆలోచనలోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు కేసిఆర్ సంగతి చూడాలని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ గట్టిగా కొట్లాడితే ఇంకోడు బయటపడే అవకాశం ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని, బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదని, ఈ సందర్భంగా బండి పేర్కొన్నారు.