KCR: తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా కలిసివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా ఇద్దరు ముఖ్య నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ధాన్యం కొనుగోలుకు సర్కార్పై యుద్దానికి రైతులు సిద్ధం కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రో ఉదంతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా గిరిజనుల కోసం ఉద్యమించనున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
నాగార్జున సాగర్ ఎన్నికలు ఉండడంతో ఓట్ల కోసం అసెంబ్లీలో ఐకేసీ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రైతన్నలు త్వరగా మేలుకోని.. సర్కార్పై యుద్దం ప్రకటించాలని కోరారు. పంటలు కోసి నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఒక్క ఐకేపీ సెంటర్ ఎందుకు ప్రారంభించలేదని సర్కార్ను ప్రశ్నించారు. ఆరు నెలలుగా కష్టపడ్డ రైతన్న.. పంటను అమ్ముకోవడానికి ఐకేపీ కేంద్రాల వద్దకు తెచ్చి నెలరోజులుగా నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం పడిన అకాల వర్షానికి చాలా ధాన్యం తడిసిపోవడం… నీటిలో కొట్టుకుపోవడం జరిగిందని తెలిపారు. మళ్లీ ఒక అకాల వర్షం పడితే ఆ ధాన్యం పాడవుతుంది కాబట్టి మీరు వెంటనే చీఫ్ సెక్రెటరీ, సంబంధిత మంత్రికి చెప్పి ఐకేపీ సెంటర్ల ప్రారంభం చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతన్నలు ఏకం కావాలని కోరారు.
రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇక్కడి గిరిజనులు హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల సాయం ప్రకటించాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే కొమురం భీమ్ స్పూర్తితో ప్రత్యేక కార్యచరణతో ఉద్యమం చేపడుతాం అని పేర్కొన్నారు.