Kaushik Reddy: హుజూరాబాద్ పార్టీ నేత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఆడియో టేప్ లీక్ వ్యవహారం నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆభియోగంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో తెలంగాణలో ఖాళీ కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ లు ఉంటే వారందరినీ కాదని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. భారీ ఎత్తున ముడుపులు తీసుకుని రేవంత్ కు పదవి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండి హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవదని రేవంత్ రెడ్డి అనడాన్ని ఆయన తప్పుబట్టారు. కరీంనగర్ లో డిపాజిట్ రాని వ్యక్తికి ఇక్కడ పోటీ పెట్టేందుకు యత్నిస్తున్నారని అందుకే పార్టీని వీడుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు పొన్నం ప్రభాకర్ కి టికెట్ ఇస్తే డిపాజిట్ దక్కదన్నారు.
మరో పక్క పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై కోవర్డ్ గా మారి పార్టీకి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్లు వారు తెలిపారు. అయతే అంతకు ముందే కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. ఈ నెల 16 కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.