BJP: వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో భాగంగా ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పక్కన పెట్టిన సీనియర్ మంత్రులు పలువురికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు బీజేపీ జాతీయ కార్యదర్శులతో తన అధికార నివాసంలో సమావేశమైయ్యారు. తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వీరితో పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో అయిదు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో సన్నద్ధతపై ప్రధానంగా సమీక్షించినట్లు సమాచారం.
మంత్రి పదవులు వదులుకున్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్థన్, ప్రకాష్ జవదేకర్, సదానంద గౌడ, రమేష్ ఫొఖ్రియాల్ నిశాంక్ వంటి సీనియర్ సీనియర్ నేతలను పార్టీ పదవుల్లో నియమించనునట్లు తెలుస్తోంది. వీరిలో సదానంద గౌడ, హర్షవర్థన్ లను వారి సొంత రాష్ట్రాలలో బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా యూపికి చెందిన ప్రముఖ ఓబీసీ నేత, స్వతంత్ర హోదాలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సంతోష్ గంగ్వార్ ను గవర్నర్ గా నియమించనున్నట్లు సమాచారం. ధావర్ చంద్ గహ్లాత్ ను గవర్నర్ గా పంపడంతో రాజ్యసభ లో సభాపక్ష నేత పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ కీలకమైన పదవిని ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి గానీ లేక ధర్మేంద్ర ప్రధాన్ కి అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భూపేంద్ర యాదవ్ ను కేబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పదవిని మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సివచ్చిన అయిదుగురిలో ఒకరికి అప్పగించే అవకాశం ఉంది. భూపేందర్ యాదర్ బీహార్, గుజరాత్ లలో పార్టీ వ్యవహారాల బాధ్యునిగా కూడా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటినీ భర్తీ చేయాల్సి ఉంటుంది.
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఖాళీగా ఉన్న అయిదు స్థానాలను సీనియర్ తో భర్తీ చేయాలనీ, యూపీ ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవాస గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ వంటి సీనియర్ లకు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమన్వయ బాధ్యతలను సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ కు అప్పగించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం.