MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు 106 ఓట్ల మెజార్టీతో మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడుగా ఎన్నికైన మంచు విష్ణు అందరినీ కలుపుకుపోవాలని తాపత్రయపడుతున్నప్పటికీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మా సభ్యుల్లో పెద్ద చీలికకు కారణం అయ్యాయి. మేము అంతా ఒకటే, మాది మా కుటుంబం, మాలో ఏ బేధాలు లేవు, ఎన్నికల వరకే రాజకీయం, ఎన్నికల అనంతరం అందరూ కలిసే ఉంటామని పైకి పేర్కొన్నప్పటికీ అంతర్గత రాజకీయాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. అభిప్రాయ భేదాలు, మనస్పర్ధనలతో కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
MAA: రాజీనామాలపై తొలి ఈసీ మీటింగ్ లో నిర్ణయం
దీనిపై నూతన అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఇటీవలే చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు కళాకారుల పెన్షన్ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ నెల 16న (ఎల్లుండి) ఉదయం 11,45 గంటలకు మా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పిన మంచు విష్ణు .. తొలి ఈసీ మీటింగ్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ తో సహ అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు మంచు విష్ణు. అసోసియేషన్ అభివృద్ధికి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని మంచు విష్ణు పేర్కొన్నారు. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు తదితర పెద్దలను కలిసిన విష్ణు నేడు నందమూరి బాలకృష్ణను కలిశారు. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా భవన నిర్మాణంలో అండగా ఉంటానని ఎన్నికలకు ముందే బాలకృష్ణ హామీ ఇచ్చారని విష్ణు అన్నారు.
‘చిరు’ అంకుల్ ఆశీస్సులు తీసుకుంటా
త్వరలో మెగాస్టార్ చిరంజీవిని కూడా కలుస్తానని పేర్కొన్నారు విష్ణు. ఎన్నికలకు ముందు కూడా విష్ణు సినీ పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇదే ఆయనకు ప్లస్ అయ్యిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రకాశ్ రాజ్.. మెగా బ్రదర్స్ ను మాత్రమే నమ్ముకుని సినీ పెద్దల ఆశీస్సులు తనకు అవసరం లేదనీ, సభ్యుల మద్దతు ఉంటే చాలు అన్నట్లుగా మాట్లాడటమే ఆయనకు ఎన్నికల్లో మైనస్ అయ్యిందని అంటున్నారు. ఓ పక్క విష్ణు విజయానికి మంచు మోహన్ బాబు పూర్తి స్థాయిలో కృషి చేశారు. ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడటం, చిరంజీవి మాత్రం బహిరంగంగా మద్దతు తెలియజేయకుండా పెద్దమనిషిగా వ్యవహరించడంతో ప్రకాశ్ రాజ మైనస్లో పడ్డారనేది సినీ వర్గాల్లో టాక్.