MLA Raja Singh: తెలంగాణ మంత్రి హరీష్ రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. హరీష్ రావుతో రాజాసింగ్ గంట పాటు చర్చలు జరిపారు. రాజాసింగ్ పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని గత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు మార్లు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేశారు. కానీ పార్టీ హైకమాండ్ నుండి సానుకూల నిర్ణయం రాలేదు. మరో పక్క బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా నియమితులైయ్యారు.
కిషన్ రెడ్డితో రాజాసింగ్ గతం నుండి విభేదాలు ఉన్నాయి. ఈ తరుణంలో మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న హరీష్ రావును బీజేపీ సస్పెన్షన్ నేత రాజాసింగ్ కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టింగ్ ల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేసింది. సస్పెన్షన్ ముందు వరకూ ఆయన అసెంబ్లీ లో బీజేపీ పక్ష నేతగా ఉన్నారు.
రాజాసింగ్ వరుసగా రెండు సార్లు 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఎన్నికలలోపు బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. దీంతో అధికార బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రి హరీష్ రావును కలిసినట్లుగా రాజాసింగ్ చెబుతున్నారు. ఇతర విషయాల గురించి తాము చర్చించలేదని అన్నారు. అయితే పార్టీ మారతారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేసి వెళ్లిపోయారు రాజాసింగ్. చూడాలి రాజాసింగ్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారో..!