Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసిఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబులను అహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను రేవంత్ రెడ్డే ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 1.04గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, ఇద్దరు చంద్రులు (చంద్రబాబు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు) హజరు అవుతారా లేదా అన్న చర్చ జరుగుతుంది. పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేసిఆర్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలతో సన్నిహితంగా మాట్లాడుతుండే వారు కానీ రేవంత్ రెడ్డి విషయంలో బద్ద శత్రువుగా చూస్తూ వస్తున్నారు. రేవంత్ కూడా కేసిఆర్ టార్గెట్ గా అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి విజయం సాధించారు. ప్రస్తుతం ఆహ్వానం అందినప్పటికీ కేసిఆర్ రేవంత్ ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
మరో పక్క పొరుగు తెలుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ హజరు అవుతారా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలు వేరు అయినా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగించుకోవాల్సి అవసరం ఉంటుంది. ఇదే క్రమంలో గతంలో జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇటు తెలంగాణ సీఎం కేసిఆర్, అటు తమిళనాడు సీఎం స్టాలిన్ హజరై అభినందనలు తెలియజేశారు. అప్పట్లో కేసిఆర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే జగన్మోహనరెడ్డి ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కారణంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హజరు అవ్వకపోతే ఏపీ ప్రభుత్వం తరపున ఎవరినైనా ప్రతినిధిని పంపుతారా అనేది చూడాలి. ఎందుకంటే.. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో జగన్ కు సొంత మనిషిగా గుర్తింపు ఉన్న వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండనున్నారు. అంతే కాకుండా తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎటువంటి విభేదాలు లేవు. అయితే రాజకీయంగా విమర్శలు రాకుండా ఉండేందుకు ఆయన నేరుగా ప్రమాణ స్వీకారానికి హజరు కాకపోయినా ప్రభుత్వ ప్రతినిధిని పంపి అభినందనలు తెలియజేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హజరు అవుతారా లేదా అనే దానిపైనా చర్చ జరుగుతోంది. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హజరయ్యే వారని ఒక వాదన వినబడుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ గెలుపునకు టీడీపీ పరోక్ష సహకారం అందించిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేందుకే పోటీ నుండి టీడీపీ తప్పుకున్నట్లుగా భావిస్తున్నారు. తాను ఇచ్చిన అవకాశంతోనే రేవంత్ రాజకీయంగా ఎదిగారన్న భావన చంద్రబాబులో ఉంది. రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు తనకు రాజకీయ జన్మనిచ్చిన గురువు గా చంద్రబాబును భావిస్తానని పేర్కొన్నారు. టీడీపీ నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి .. చంద్రబాబును, టీడీపీని ఏనాడూ విమర్శించలేదు. టీడీపీ నుండే తన రాజకీయ ఎదుగుదల సాధ్యమయ్యిందని ఆయన ఇప్పటికీ అంగీకరిస్తారు.
తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత గాంధీ భవన్ వద్ద టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. ఏపీకి చెందిన అనేక మంది టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. టీడీపీ నుండి ఎగిగిన రేవంత్ సీఎం పదవి చేపట్టడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రమాణ స్వీకారానికి హజరు అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమిలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్న కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా లేదా అనేది చూడాలి. ఒక వేళ ఈ కార్యక్రమానికి చంద్రబాబు పాల్గొంటే ఇండియా కూటమికి చేరువ అవుతున్నారు అనే వాదన బయటకు వస్తుంది. అందుకే రాజకీయంగా అన్ని విషయాలను ఆలోచన చేసే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆహ్వానితుల్లో ఎవరెవరు హజరు అవుతారు అనేది రేపు తేలనుంది.