Vijayasanti:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీజేపీ నుండి కీలక నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా రాములమ్మ (విజయశాంతి) బీజేపీకి రాజీనామా చేశారు. విజయశాంతి తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఎల్లుండి (17వ తేదీ) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2020 నుండి విజయశాంతి బీజేపీలో కొనసాగారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. త్వరలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆ మరుసటి రోజే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాగా విజయశాంతి బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలికిన బీజేపీ నేతల్లో ఉన్నారు. ఈ సందర్భంగా మల్లు రవి వ్యాఖ్యలపై విజయశాంతి వద్ద మీడియా ప్రస్తావించగా, అటువంటిది ఏమిలేదు, హాపీ దివాళీ అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు.
అయితే బీజేపీ నాయకత్వంపై విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దానికి తోడు ఇటీవల పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలోనూ విజయశాంతి పేరు లేకపోవడంపై ఆమె పార్టీ మార్పు ఖాయమే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా రెండు రోజుల క్రితం విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలు ఎక్స్ (ట్విట్టర్), ఫెస్ బుక్ లలో ప్రొఫైల్ పిక్ మార్చేశారు. అంతకు ముందు మెడలో కాషాయ కండువాతో ఉన్న ఫోటో ఉండగా, ఆ ఫోటోను తొలగించారు. ఇవేళ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా .. సీఐడీ వాదనలు ఇలా..