Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రతీకార కేసు కాదన్నారు. గత ప్రభుత్వ హయంలోనే స్కిల్ స్కాంపై దర్యాప్తు ప్రారంభమైందన్నారు. 2018లోనే సీఐడీ, సీబీఐకి కూడా ఫిర్యాదు అందిందని ధర్మాసనానికి తెలిపారు. సీమెన్స్ అంతర్గత విచారణలోనూ అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించారని ఏఏజీ వెల్లడించారు. స్కిల్ కేసులో దోచుకున్న డబ్బంతా హవాలా మార్గంలో చివరికి హైదరాబాద్కు చేరిందనీ, దీనికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వాదించారు.
ఫోరెన్సిక్ ఆడిట్ కూడా రూ.241 కోట్లు దారి మళ్లాయని నిర్ధారించిందన్నారు. అసలు ప్రాజెక్ట్ విలువ రూ.36 కోట్లు మాత్రమే అయితే దాన్ని వేల కోట్లు పెంచి చూపించారన్నారు. నిధుల విడుదలపై నాటి ఫైనాన్స్ సెక్రటరీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఫైనాన్స్ సెక్రెటరీ వద్దని చెప్పినా కూడా చంద్రబాబు ఆదేశాలతో సీఎస్ నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం విడుదల చేయమంటేనే నిధులు విడుదల చేస్తున్నట్లు పీపీ రమేష్ నోట్ ఫైల్లో రాశారని చెప్పారు. కేంద్ర సంస్థ సీఐటీడీని కూడా మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్ తీసుకున్నారని అదే రిపోర్ట్ ను ఉపయోగించి ఈ రేట్లను కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవ్ చేసిందని అన్ని కోర్టులలో ప్రచారం చేస్తున్నారని ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. కాగా చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాల నివేదికను హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.
చంద్రబాబు కుడి కంటికి శస్త్ర చికిత్స నిర్వహించాం. ఆయన కోలుకోవడానికి తప్పకుండా మందులు వాడాలి. అయిదు వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యుల్ ఇచ్చాం. కంటికి అయిదు వారాల పాటు ఇన్ ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదు వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయి. మథుమేహం అదుపులో ఉంది. జాగ్రత్త లు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. సీఐడీ వాదనలు, చంద్రబాబు తరపు న్యాయవాదులు అందజేసిన నివేదికలను పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను రేపు(గురువారంధ) మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
Telangana Election 2023: రెబల్స్ ను దారికి తెచ్చుకోవడంలో సఫలమైన కాంగ్రెస్