YS Jagan Bail Issue: అక్రమాస్తుల కేసులో ఏపి సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును ఆగస్టు 25న వెల్లడించనుండి. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ నేడు మరో సారి సమయం కోరింది. సీబీఐ నుండి ఎలాంటి సమాచారం ఇంకారాలేదని తెలియజేసిన సీబీఐ తరపు న్యాయవాది మరి కొంత సమయం ఇవ్వాలని కోరారు. వీరి అభ్యర్థనను రఘురామ తరపు న్యాయవాది వెంకటేశ్ వ్యతిరేకిస్తూ గడువు ఇవ్వవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఇదే రోజు ఏదో ఒకటి చెప్పేయాలనీ, అందుకు మరింత సమయం ఇస్తామంటూ విచారణను కోర్టు కొద్దిసేపు వాయిదా వేసింది. కొద్దిసేపటి తరువాత సీబీఐ న్యాయవాది తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇక విచారణ ముగిసిందనీ, ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
ఈ కేసులో తొలి నుండి సీబీఐ ప్రవర్తించిన తీరు వల్ల విమర్శలను ఎదుర్కొంటోంది. తొలుత కోర్టు విచక్షణకు వదిలివేస్తున్నామని చెప్పిన సీబీఐ తదుపరి లిఖిత పూర్వక వాదనలు వినిపిస్తామని సమయం కోరింది. ఆ తరువాత సీబీఐ అధికారులకు జ్వరం వచ్చిందంటూ వాయిదా కోరింది. మళ్లీ ఈ రోజు వాయిదా కోరగా.. కోర్టు అంగీకరించకపోవడంతో వాదనలు వినిపించడం లేదని స్పష్టం చేసింది.