గ్రానైట్ తవ్వకమంటే కోట్లలో ముగిని తేలుతున్నట్లే. ఒక్క సారి గనుక దాని లొసుగులు తెలుసుకుని ఆ వ్యాపారంలో అడుగు పెట్టి ఆరి తేరితే కాదనుకున్నా కోట్లు వచ్చి పడతాయి. అలాగే ప్రకాశం జిల్లాలో గడచిన రెండు దశాబ్దాలుగా ఎంతో మంది కోటీశ్వరులు తయారు అయ్యారు. ఆ జిల్లాలోని చీమకుర్తి, బల్లెకురవ ప్రాంతాల్లో దాదాపు మూడు వేల ఎకరాల్లో గ్రానైట్ క్వారీయింగ్ జరుగుతూ ఎంతో మంది చిన్న వాళ్లను పెద్ద వాళ్లను కోటీశ్వరులను చేసింది. తాజాగా ఇప్పుడు ఆ గ్రానైట్ క్వారీల లీజులను దక్కించుకునేందుకు అధికార పార్టీలోని చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. జిల్లా పెద్దల ద్వారా, ప్రభుత్వ పెద్దల ద్వారా అధికారులపై ఒత్తిడులు కూడా తీసుకువస్తున్నారు. ఇంతకూ అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం రండి.
గొట్టిపాటి లీజ్ రద్దుతో వైసిపిలో పోటీ
ప్రకాశం జిల్లా అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు బల్లికురప, గురిజేపల్లి గ్రామాల పరిధిలో 11 గ్రానైట్ క్వారీల లీజ్ లైసెన్సులు ఉండగా, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు సంబంధించి చీమకుర్తి వద్ద గ్రానైట్ క్వారీ లీజులు ఉన్నాయి. ఈ లీజ్ లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్వారీ లీజ్ లైసెన్సు దారులు గతంలో చెల్లించాల్సిన జరిమానా బకాయిలు చెల్లించలేదనీ, నిబంధనలు ఉల్లంఘించారనీ తదితర కారణాలతో మైనింగ్ శాఖ అధికారులు లీజులను రద్దు చేశారు. గతంలో వీరు ఈ లీజ్ లకు సంబంధించి కోర్టును ఆశ్రయించగా లీజుదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు క్వారీయింగ్ జరగకుండా కాపలా ఏర్పాటు చేశారు. వీటిపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్న లీజుదారులు మళ్లీ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉఁడగా రద్దు అయిన ఈ క్వారీ లైసెన్సులకు మైనింగ్ శాఖ అధికారులు త్వరలో టెండర్ల ప్రక్రియను నిర్వహించనున్న నేపథ్యంలో ఆ క్వారీలను కైవశం చేసుకునేందుకు అధికార వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. క్వారీ లీజులు పొందేందుకు వైసిపి నేతలు ధరఖాస్తుల కోసం బారులు తీరుతున్నారు. ఇప్పటికే గ్రానైట్ రంగంలో అనుభవం ఉన్న వైసిపి నేతలతో పాటు కొత్త వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సన్నదం అవుతున్నారు.