పెళ్లికూతుళ్లను వద్దంటున్న అబ్బాయిలు
తమిళనాడలో బయటపడ్డ సెక్స్ రాకెట్
సోషల్ మీడియా నిషేధిస్తున్న తల్లిదండ్రులు
ఇంటి నుంచి అమ్మాయిలను పంపని వైనం
పొల్లాచ్చి: తమిళనాడులోని ఓ చిన్న పట్టణం పొల్లాచ్చి. నిన్న మొన్నటి వరకు ఆ ఊరు పేరు కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడది బాగా ఫేమస్ అయిపోయింది. భారీ ఎత్తున అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు బయటపడటంతో అంతా షాక్ తిన్నారు. ఆ ఊరి నుంచి పెళ్లి సంబంధం వచ్చిందంటే చాలు.. ‘పాల్లాచ్చి అమ్మాయా.. వద్దు బాబోయ్’ అని అబ్బాయిలు పారిపోతున్నారు. తల్లిదండ్రులైతే అమ్మాయిలను కాలేజీలకు పంపడం మానేశారు. కావాలంటే దూరవిద్యా పద్ధతిలో చదువుకోవాలని చెబుతున్నారు. చాలా వరకు ఇళ్లలో అమ్మాయిలను బయటకు పంపడం లేదు, సోషల్ మీడియా కూడా వాడకుండా నిషేధించారు. సాధారణంగా ఇన్నాళ్లూ పొల్లాచ్చి అంటే మంచి పేరుండేదని, కానీ ఇప్పుడు ఇక్కడి అమ్మాయిలకు పెళ్లిళ్లు కావడం కూడా కష్టమైపోయిందని ఓ విద్యార్థిని అన్నారు. తన తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లడం ఆపేసి కరస్పాండెన్స్ కోర్స్ చదవమంటున్నారని మరో విద్యార్థిని చెప్పారు.
సోషల్ మీడియా చేసిన పాపం
ఎంబీయే, ఇంజనీరింగ్ చదివిన పట్టభద్రులు నలుగురు కలిసి యువతులను లైంగికంగా వేధించారు. వారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దోచుకుంటూ, వారిని వాడుకున్నారు. ముందుగా సోషల్ మీడియాలో స్నేహం చేసి, ఆ తర్వాత వారిని లాంగ్ డ్రైవ్ లు, హోటళ్లకు తీసుకెళ్లి లైంగికంగా దోచుకునేవారని పోలీసులు చెప్పారు. పొల్లాచ్చి తమిళనాట కోయంబత్తూరు జిల్లాలోని ఓ చిన్న మునిసిపాలిటీ. ఇక్కడ చాలామంది విద్యార్థినులను నలుగురు యువకులు బుట్టలో వేసుకున్నారు. అయితే, ఈ రాకెట్ వల్ల తామందరిపై చెడ్డపేరు వస్తోందని అబ్బాయిలు వాపోతున్నారు. ఇంతకాలం తమకు మంచి స్నేహితులుగా ఉన్న అమ్మాయిలతో కూడా మాట్లాడలేకపోతున్నామన్నారు. వాళ్లు తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చెప్పేవారిమని అన్నారు.
ఎలా బయట పెడతారు?
ఇప్పటివరకు ఒక్క అమ్మాయి మాత్రమే ఫిర్యాదు చేసింది. అయితే తాము కూడా బాధితులమేనని చాలామంది అమ్మాయిలు అనధికారికంగా వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లా పోలీసులు, హోం శాఖ కార్యదర్శి బాధితురాలి పేరు బయటపెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. తమ వివరాలు గోప్యంగా ఉంటాయన్న నమ్మకం బాధితులకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా పేరు బయట పెట్టడంపై మద్రాసు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి రూ. 25లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.