కోర్టుకు పేస్లిప్ చూపించిన నీరవ్ మోదీ
బెయిల్ పొందడానికి విశ్వ ప్రయత్నాలు
న్యూఢిల్లీ: తాను నెలకు రూ. 18 లక్షల జీతానికి లండన్ లో పని చేసుకుంటున్నానని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చెప్పాడు. బ్యాంకులను రూ. 13 వేల కోట్ల మేర మోసం చేసిన అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద అతడిని అప్పగించాలని భారత్ కోరుతోంది. ఆ కేసును లండన్ కోర్టు విచారిస్తోంది. నీరవ్ మోదీని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, అతడిపై విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నందున తప్పించుకోడానికి వీల్లేకుండా రిమాండు విధిస్తున్నట్లు మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి తెలిపారు. వదిలిపెడితే మళ్లీ లొంగే అవకాశం లేదని నమ్మడానికి తనకు తగినంత కారణాలున్నాయని అన్నారు.
బెయిల్ ఇవ్వండి ప్లీజ్..
బెయిల్ ఇవ్వడానికి తాను రూ. 4.5 కోట్లు (5 లక్షల పౌండ్లు) చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని నీరవ్ మోదీ కోర్టుకు చెప్పాడు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నాడు. కానీ, కోర్టు నిరాకరించడంతో ప్రస్తుతానికి స్కాట్లండ్ యార్డు కస్టడీలోనే ఉంటాడు. తాను నెలకు రూ. 18 లక్షల జీతం సంపాదిస్తున్నానని, పన్ను కూడా కడుతున్నానని పే స్లిప్పులను కోర్టుకు చూపించాడు. అలాగే, పని చేయడానికి వీలు కల్పించే జాతీయ బీమా (నేషనల్ ఇన్సూరెన్సు – ఎన్ఐ) నంబరు కూడా చూపించాడు. తనపై ఎలాంటి నేరం మోపకముందే గత సంవత్సరం జనవరిలో తాను యూకే వచ్చినట్లు నీరవ్ చెప్పాడు. తాను బ్రిటన్ లో చట్టబద్ధంగానే ఉంటున్నానని, అందువల్ల నేరగాళ్ల అప్పగింత ఒప్పందం వర్తించదని అన్నాడు. తాను గత ఐదేళ్లుగా ఇక్కడ పనిచేసుకుంటూ చదువుకుంటున్నానని, ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నానని తెలిపాడు.
నీరవ్ మోదీకి సంబంధించిన ఎంప్లాయిమెంట్ పాస్, హాంకాంగ్ బ్యాంక్ ఐడీ కార్డు, ఇతర బ్యాంకు కార్డులను అతడి తరఫు న్యాయవాది కోర్టుకు చూపించారు. నీరవ్ ఎక్కడికీ పారిపోవాలని అనుకోవడం లేదని చూపించేందుకు ప్రయాణ పత్రాలు కూడా సమర్పించారు. న్యూ ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ 1010లోని అపార్టుమెంటు 42లో నివసిస్తున్నట్లు తెలిపారు. నీరవ్ మోదీ సోహోలో తగిన అనుమతులు తీసుకుని వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు ద టెలిగ్రాఫ్ పత్రిక తన కథనంలో పేర్కొంది.