(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా ఉత్తర్వుల ఆధారంగా ఇద్దరు లోక్సభ ఉద్యోగులకు వేటుపడింది. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులను ఫండమెంటల్ రూల్ 56 కింద ముందస్తు పదవీ విరమణ చేయించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గత నెల 28వ తేదీన ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఇది జారీ అయిన రెండు రోజుల్లోన లోక్సభలో పని చేసే ఇద్దరు ఉద్యోగులకు ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిల్లా అనూహ్య నిర్ణయం తీసుకోవడం విశేషం.
లోక్సభలో అనువాద విభాగంలో జాయింట్ డైరెక్టర్గా పని చేస్తున్న ప్రణవ్ కుమార్, కావేరి జైస్వాల్లతో ఆగస్టు 31న పదవీ విరమణ చేయించినట్లు లోక్సభ సచివాలయం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నది. వీరిద్దరికి ముందస్తు నోటీసులకు బదులు మూడు నెలల జీత భత్యాలు ఇచ్చి ముందస్తు పదవీ విరమణ చేయించి ఇంటికి పంపారు. ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా వీరు బయట ఇతరత్రా ఆర్థిక కార్యకలపాలు నడుపుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిపై చిటీల నిర్వహణ, తోటి సిబ్బంది వద్ద డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టగా ఆ ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి.
ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు
లోక్సభలోనే ఇద్దరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై ఈ విధంగా వేటు వేయడంతో వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుబులు పట్టుకున్నది. చాలా ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఆర్థికపరమైన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరిలో భయం పట్టుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు చిటీ పాటల నిర్వహణ, ఇతర అనధికార ఆర్థిక వ్యాపారాలు నిర్వహించకూడదని గతం నుండి నిబంధనలు ఉన్నా అంతగా ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ముందస్తు పదవీ విరమణ వేటు లాంటి కఠిన శిక్షలు అమలు చేయడంతో అటువంటి వ్యాపారాలు చేసే వారిలో ఆందోళన మొదలు అవుతోంది.