పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో చోటుచేసుకున్న ఈ యదార్థ సంఘటన ఇప్పుడు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోంది. చనిపోయిన యజమాని ఏటీఎం కార్డు ని దొంగలించి 35 లక్షల రూపాయలను విత్ డ్రా చేసిన పనిమనిషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.
వివరాల్లోకి వెళితే నదియా, నాసిక పూర్ కు చెందిన రీటా రాయ్…. అన్వర్ షా రోడ్డులోని ఒక ఇంటిలో ఏడేళ్లుగా పని చేస్తోంది. లాక్ డౌన్ మొదలైన తర్వాత కొద్ది రోజులకే ఆ ఇంటి యజమాని అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇక అతడి ఏటీఎం పిన్ నెంబర్ తెలిసిన రీటా.. ఆ యజమాని యొక్క ఏటీఎం కార్డు ని దొంగలించి గత రెండు నెలలుగా ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా చేయడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకూ 35 లక్షల రూపాయలను విత్ డ్రా చేసింది.
ఇక తన తండ్రి ఖాతాలో నుంచి డబ్బులు విత్డ్రా అవుతున్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బ్యాంకు కి వెళ్లి విచారించి ఎటిఎం లను పరిశీలించి పోలీసులు ఇదంతా చేసింది వారి ఇంటిలో ఇన్నాళ్ళూ నమ్మకంగా పని చేసిన పని మనిషి అని తెలుసుకున్నారు. వెంటనే ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి రీటా ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు డబ్బులు విత్ డ్రా చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
డబ్బులు డ్రా చేసే విషయంలో ఆమెకు సహకరించి, ఆమెకు సూచనలు ఇచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మొత్తం డబ్బుల్లో 27 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మీ ఇళ్లలో ఉన్న పనివాళ్ళు నమ్మకస్తులు కాదు అని కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. కాబట్టి ముఖ్యంగా అపరిచిత వ్యక్తులకు…. వీలైతే మన ఇంట్లో వాళ్లకు కూడా మన సొంత ఎటిఎం తెలియకపోవడం మంచిదని సలహా.