ప్రస్తుతం కుర్రకారు పొద్దున లేచినప్పటినుండి పడుకునే వరకూ ఫోన్ ను వదలట్లేదు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా జపమే. ఇక ఆన్లైన్ గేమ్స్ లో అయితే మునిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా కాలంలో స్కూల్స్ లేకపోవడంతో ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా సైట్స్ కి బాగా మరిగిపోయారు పిల్లలు.
ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ పిచ్చితో తమ ప్రాణాలను కోల్పోయారు కూడా. యువత అయితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. తాజాగా పబ్జి గేమ్ కు బానిసైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం నగరంలో రెవెన్యూ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇతని ఆత్మహత్యకు సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా…? కేంద్ర ప్రభుత్వం వందకు పైగా చైనా యాప్స్ ను పాపులర్ మల్టీప్లేయర్ వీడియో గేమ్ పబ్జి తో పాటు చేసిన విషయం తెలిసిందే కదా….!
దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు ఈ నిర్ణయం చూసి హర్షించగా…. యువతంతా నిర్ఘాంతపోయింది. ఇక ఈ కుర్రాడు విషయానికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే పబ్జి ఆన్లైన్ గేమ్ కి అడిక్ట్ అయిపోయిన ఇతను ఇక లాక్ డౌన్ సమయంలో కూడా అధిక సమయం ఇంటిలో ఆన్లైన్ గేమ్ లోనే ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పబ్జి పై నిషేధం విధించిన తర్వాత ఈ నెల 7న ఇంటి పైన నిర్మాణంలో ఉన్న ఒక గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఎక్కడా కనిపించని కుమారుడి కోసం ఊరంతా వెతికిన తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రాణి ఇక లాభం లేదు అనుకొని తన కుమారుడు తప్పిపోయాడు అని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఇక శుక్రవారం ఇంటి పై నిర్మాణంలో నుండి దుర్వాసన వస్తుండడంతో కూలీలు తలుపులు పగలగొట్టి చూశారు. చూస్తే విగతజీవుడిగా తమ కొడుకు కిరణ్ ను చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు. కిరణ్ మరణాన్ని పోలీసులు ఆత్మహత్య గా నమోదు చేసుకున్నారు.