గతకొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ లో సంచలనాలు సృష్టిస్తున్నారు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అధికారపార్టీపైన ఆయన అవాకులూ చవాకులూ పేలుతున్నారని, ఎమ్మెల్యేలను దూషిస్తున్నారని, వ్యవహారం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదుచేసేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను తాను పక్కా హిందూగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ఏపీలో ఉన్న హిందువులకు అనధికారిక ప్రతినిధిగా భావించుకునే క్రమంలో… కొన్ని వర్గాలను నేరుగా దూరం చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! తాజాగా జరిగిన ఒక టీవీ ఇంటర్యూలో ఇలా అతితెలివైన కామెంట్లు చేశారు ఆర్.ఆర్.ఆర్.!
తానేదో తెలివైన వ్యక్తిగా, తాను మాత్రమే అతితెలివైన వ్యక్తిగా భావిస్తోన్నారు అన్న కామెంట్ ని సొంతం చేసుకున్న ఆర్.ఆర్.ఆర్… జగన్ కు అతిబలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులను, దళిత క్రైస్తవులను దూరం చేసుకోవడంతోపాటు… రాజుల ఓటు బ్యాంకును కూడా పరిపూర్ణంగా దూరం చేసుకునే పనికి పూనుకున్నారు!
తన నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో దళిత వాడలకు వెళ్లినప్పుడు… అక్కడ అధికారికంగా ఒక్క క్రీస్టియన్ కూడా లేరని, కానీ 10 చర్చిలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి నూటికి 90శాతం దళితులు, క్రైస్తవులుగా మారిపోయారని… అలాంటప్పుడు వారు బీసీ-సీ కేటరిగీరిలోకి వస్తారని అప్పుడు వారికి కేవలం 2శాతం రిజర్వేషన్ మాత్రమే వర్తించాలనేది ఆయన డిమాండ్! కాబట్టి… క్రైస్తవులుగా మారిన దళితులు.. ఎస్సీ రిజర్వేషన్ ని అనుభవిస్తున్నారనేది ఆయన అభియోగం! దీంతో… గత ఎన్నికల్లో జగన్ కు పూర్తి మద్దతు ప్రకటించిన దళిత క్రైస్తవుల ఓట్లతోనే నేడు ఆర్.ఆర్.ఆర్. ఎంపీ స్థానంలో ఉన్నారనే విషయం గుర్తుచేస్తున్నారు దళిత క్రైస్తవులు!
ఈ విషయంపై రాజ్యాంగ సవరణ జరగాలని కూడా కొన్ని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే!! అలాంటప్పుడు… నిజంగా ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాలనుకుంటే, దళితులపైనా, దళిత క్రైస్తవులపైనా అంత ప్రేమ ఉంటే… కేంద్రంలో ఆ రాజ్యాంగ సవరణ దిశగ పనిచేసి, వారి మనసు దోచుకోవాలి కానీ.. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు.. ఉన్నది పోగొట్టుకోవడం తప్ప అని ఆర్.ఆర్.ఆర్.పై కామెంట్లు పడుతున్నాయి!
ఇదే సమయంలో రాజులంతా ఆర్.ఆర్.ఆర్. వైపే ఉన్నారా? అన్న ప్రశ్నకు స్పందించిన రఘురామకృష్ణంరాజు… సుక్షత్రియులు అయినవారంతా తనవైపే ఉన్నారని కామెంట్ చేశారు. దీంతో రాజులంతా ఆర్.ఆర్.ఆర్.పై ఫైరవుతున్నారు. అంటే… రఘురామ కృష్ణంరాజు వైపు ఉన్నవారు మాత్రమే సుక్షత్రియులు.. తన వైపు లేనివారంతా అక్షత్రియులు అని అనడం ఆయన ఉద్దేశ్యం అని.. అంతకు మించిన దౌర్భగ్యకరమైన కామెంట్ మరొకటి ఉండదనేది వారి వాదన!
రాజసం అనేది… మనిషి ప్రవర్తనలోనూ.. హుందాతనంలోనూ.. విశ్వాసం సంపాదించుకోవడంలోనూ.. ఆ విశ్వాసం నిలబెట్టుకోవడంలోనూ.. పదిమందికి సాయం చేసే గుణంలోనూ ఉంటుంది తప్ప “కులం”లో కాదని… పైగా ఆయన వెంట ఉంటేనే సుక్షత్రియులు అనడం అజ్ఞానమని.. 21వ శతాబ్ధంలో కూడా ఆర్.ఆర్.ఆర్ కు ఈ విషయం అర్ధం కాకపోవడం దౌర్భాగ్యకరమని.. “ఆర్.ఆర్.ఆర్. కు మద్దతు పలకని సుక్షత్రియుల” నుంచి అభిప్రాయాలు రావడం కొసమెరుపు!!