గత కొద్దికాలంగా, కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరింత దూకుడుగా స్పందించేందుకు అస్త్రం దొరికింది.
మోదీపై విరుచుకుపడటం విషయంలో ఏ అంశంతో ఆయన విజృంభిస్తున్నారో అదే అంశంతో దేశవ్యాప్తంగా టార్గెట్ చేసే అవకాశం దక్కింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు, నిధుల ఖర్చు విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని గత కొద్దికాలంగా తెలంగాణ ప్రభుత్వ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సైతం ఇదే వాదన వినిపించింది.
ఏంటీ వివాదం?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహార సెస్సు విషయం లో కొనసాగుతున్న గందరగోళం జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. వస్తు, సేవలపై పన్నులను విధించే అధికారాలను వదులుకున్నందుకు రాష్ట్రాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చినంత పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో విలాసవంతమైన, హానికారకమైన వస్తువులపై వసూలు అవుతున్న పన్ను గణనీయంగా తగ్గిందని కేంద్రం చెప్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆదాయ లోటును అధిగమించేందుకు రాష్ట్రాలే రుణాలను సేకరించుకోవాలని వాదిస్తోంది. ఈ వాదనను తెలంగాణతో పాటు కాంగ్రెస్, తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే రుణాలు సేకరించి తమకు పరిహారం చెల్లించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇప్పుడేం జరిగింది?
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రెండేండ్లలో కేంద్రం ఈ చట్టాన్ని ఉల్లంఘించిందని కాగ్ తప్పుబట్టింది. వస్తు, సేవల పన్ను అమలు వల్ల ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేందుకు ఉపయోగించాల్సిన రూ.47,272 కోట్ల నిధులను కేంద్రం అక్రమంగా తన వద్ద అట్టిపెట్టుకున్నదని తెలిపింది. వాస్తవానికి ఈ నిధులను రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించేందుకు నాన్-లాప్సబుల్ జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కలెక్షన్ ఫండ్లో జమ చేయాల్సి ఉందని, కానీ మోదీ సర్కార్ ఆ పని చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించిందని కాగ్ తన ఆడిట్ నివేదికలో దుయ్యబట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.62,612 కోట్ల జీఎస్టీ పరిహార సెస్సులో రూ.56,146 కోట్లను, 2018-19లో వసూలైన రూ.95,081 కోట్ల జీఎస్టీ పరిహార సెస్సులో రూ.54,275 కోట్లను నాన్-లాప్సబుల్ ఫండ్లోకి కేంద్రం బదిలీ చేసిందని తెలిపింది. ఈ విధంగా మోదీ సర్కార్ 2017-18లో రూ.6,466 కోట్లు, 2018-19లో మరో రూ.40,806 కోట్లు తన వద్ద అట్టిపెట్టుకుని ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్టు కాగ్ లెక్క తేల్చింది.
తెలంగాణ సర్కారు ఏమంటోంది?
కాగ్ నివేదిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన వాదననను మరింత ఉధృతం చేసింది. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్రాలను నరేంద్ర మోదీ సర్కార్ దారుణంగా మోసగిస్తున్నదంటూ తెలంగాణ సర్కార్ చేస్తున్న వాదన వాస్తవికమైనదేనని కాగ్ ధ్రువీకరించిందని స్పష్టం చేస్తోంది. ఇన్నాళ్లు తాము చేసినవి రాజకీయ విమర్శలుగా పేర్కొన్న వారు ఇప్పుడేం చెప్తారని ప్రశ్నిస్తోంది.
కేంద్రం మాట ఏమిటి?
జీఎస్టీ నిధుల మల్లింపు నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని కేంద్రం దారి మళ్లించిందంటూ కాగ్ చేసిన విమర్శను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ‘‘ జీఎస్టీ సెస్ కింద అదనంగా వసూలైన 47, 272 కోట్ల రూపాయలను మేం ఇతరత్రా పథకాలకు మళ్లించలేదు. ఆ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్కు జమ చేయకుండా తాత్కాలికంగ ా అట్టేపెట్టామని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకే పరిహారం కింద చెల్లిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కాగ్కు తెలియపర్చాం.. తాత్కాలికంగా అట్టే పెట్టడం వేరు, దారి మళ్లించడం వేరు’’ అని ఆర్థిక శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు చెప్పారు.