సీఎం జగన్ కి అగ్ని పరీక్ష ఎదురయింది. కరోనా విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభశుభాలపాలవుతున్నాయి. ఓ వైపు కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం..! కరోనా ఉన్నా స్కూళ్ళు ఓపెన్ చేసేయడం.. పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. అయితే తాజాగా బడుల్లో కరోనా కేసులు పెరుగుతూ.. విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతుండడం జగన్ కి పెద్ద పరీక్షగా మారింది. ఇప్పుడు మళ్ళీ బడులు మూసేస్తారా..? లేదు కొనసాగనీ అంటూ ఉంచేస్తారా..? అనేది కీలకంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పంజా..!!
రాష్ట్రంలో ఈ నెల రెండోతేదీన బడులు ఆరంభమయ్యాయి. నాటి నుండి ఇప్పటికే 250 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో 120 మంది టీచర్లు, పదిమంది విద్యార్థులు.. ప్రకాశం జిల్లాలో 52 మందికి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 30 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఇది మొదలు మాత్రమే. వీరికి లింకులు, మూలాలు తీస్తే సంఖ్య వేలకు చేరుతుంది. అంటే తొలి మూడు రోజుల్లోనే ఇంత మందికి సోకితే ఇంకా ముదురదన్న గారెంటీ ఏముంది..! అందుకే పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలోనూ కలవరం మొదలయింది. కరోనా ఎక్కువగా వ్యాప్తికి అవకాశం ఉన్న చోట్లలో పాఠశాలలు మొదటి స్థానంలో ఉంటాయి. విద్యార్థులు పక్కపక్కనే ఉండడం, కలిసి తిరగడం, ఆదుకోవడం.. ఇవన్నీ వ్యాప్తికి కారణాలే.
ఇతర రాష్ట్రాల్లో లేదుగా.. మనమే ఎందుకు..!?
ఇక్కడ సీఎం జగన్ ఆలోచనలను అభినందించాల్సిందే. విద్యార్థులు విద్యాసంవత్సరం పాడవ్వకూడదు. కనీసం నాలుగు, అయిదు నెలలు అయినా తరగతులు నిర్వహించాలి.. తర్వాత తరగతిని ప్రమోట్ చేయాలి.. అనే కీలక ఆలోచన చేసారు. కాకపోతే ఆ మహమ్మారి ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. పరిస్థితులకు తగ్గట్టు.., ఓ సారి సమీక్షించుకుని నిర్ణయాన్ని అమలు చేయాల్సింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనాకి భయపడి బడులు తెరవలేదు. పక్కనున్న తెలంగాణ, పైనున్న ఒడిస్సా.., కేరళ ఇలా అనేక రాష్ట్రాల్లో కరోనా వలన ఈ విద్యాసంవత్సరం బడులు తెరుస్తామో, లేదో చెప్పలేం అంటూ సాక్షాత్తూ సీఎంలే ప్రకటించేశారు. తెలంగాణాలో కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు.
రెండు రకాల నిర్ణయాలు ఎందుకు..!?
ఇక్కడ ప్రభుత్వం రెండు రకాల, రెండు నాలుకలా విధానాన్ని కూడా ఓ సారి చెప్పుకోవాల్సిందే. ప్రతిపక్షాలకు ఎలా అవకాశం ఇచ్చారు అనేది చూడాల్సిందే. కరోనా ఎక్కువగా ఉంది, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు అంటూ మంత్రులు మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరిగితే ఓట్లు వేసేది పెద్దలే.. కరోనా కారణంగా బడులు ఎందుకు తెరిచినట్టు..? పిల్లలు వెళ్లే బడులు తెరిస్తే కరోనా పోతుందా..? ఎన్నికలు నిర్వహణకు అడ్డు ఉన్న కరోనా.., బడులు తెరిస్తే ఎందుకు అడ్డు రాదు. ఎలాగూ ఈ విద్యాసంవత్సరంలో ఏడు నెలలు వృథా అయ్యాయి కదా..? మరో నాలుగు నెలలు ఆగితే పోయేదేముంది..? ఆన్లైన్ క్లాసులు నిర్వహించి పరీక్షలు నిర్వహించి.., పరీక్షలు పెట్టి పాస్ చేసేయొచ్చు. కానీ ఈ స్కూళ్ల నిర్ణయం తీసుకోవడం.., ఇప్పుడు కేసులు పెరుగుతుండడం ప్రభుత్వానికి మచ్చగా మారింది.
వెనక్కు తగ్గుతారా..? కోర్టులకు వెళ్ళాలా..!?
ఇప్పుడు ప్రభుత్వం చేతిలోనే నిర్ణయం ఉంది. స్కూల్స్ విషయంలో వెనకడుగు వేస్తారా..? ఇలాగే కొనసాగిస్తారా..? అనేది సందేహంగా మారింది. ప్రస్తుతానికి కొని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇవి ముదరలేదు. ఒక వేళ విద్యార్థుల్లో, తల్లిదండ్రులకు ముదిరితే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బదులు తప్పవు. మాయని మచ్చ తప్పదు. అందుకే తక్షణమే దీనిపై పునరాలోచించి నిర్ణయం మార్చుకోవాల్సి ఉంది. సీఎం జగన్ ఈ విషయంలో కొంచెం వెనకడుగు వేసినా పర్వాలేదు, విద్యార్థులు క్షేమం దృష్ట్యా మడమ తిప్పినా పర్వాలేదు అనేలా ఆలోచించాలి. లేకపోతే ఈ విషయంపై ఎవరు కోర్టుకి వెళ్లినా ఇబ్బందులు తప్పకపోవచ్చు. కోర్టులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆశ్చర్యం లేదు. అయితే కోర్టులకు కూడా చిక్కులు తప్పవు. ఇప్పటికే స్థానిక ఎన్నికల అంశం కోర్టుల్లో పెండింగ్ ఉంది. స్థానిక ఎన్నికలకు అనుకూలంగా తీర్పు వస్తే.., స్కూల్స్ విషయంలో ఇదో వివాదంగా మారే ప్రమాదం ఉంది.