ఢిల్లీ, మార్చి 6 : జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉన్నది. ప్రతిపక్షాల విమర్శలపై బుధవారం కేంద్ర మంత్రి వీకే.సింగ్ స్పందించారు.
దోమల్ని చంపేస్తే లెక్కబెట్టుకుంటూ కూర్చోవాలా అని వీకే.సింగ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘నిన్న రాత్రి 3.30గంటల సమయంలో నా గదిలో విపరీతంగా దోమల బెడద ఉంది. వాటి నివారణకు నేను ‘హిట్’ను వాడాను. ఇప్పుడు నేను అవి ఎన్ని చనిపోయాయని లెక్కబెట్టాలా..లేక వెళ్లి నిద్రపోవాలా?’ అని వైమానిక దాడులను ప్రశ్నిస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
‘ఇకముందు ఎప్పుడైనా భారత్ ఇలాంటి దాడులు చేసేటప్పుడు యుద్ధ విమానాలతో పాటు ఈ ప్రశ్నించే వారిని కూడా పంపిస్తాం. బాంబులు వేసినప్పుడు వారు లక్ష్యాలను చూడగలరు. అక్కడ ఏం జరిగిందో పరిశీలించి, ఎంతమంది మంది చనిపోయారో లెక్కబెట్టుకొని, తిరిగి రావచ్చు ‘ అని వీకే.సింగ్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రతిపక్షాలు ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.