Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఏపి విషయంలో కేంద్ర ప్రభత్వం, బీజేపీ అవలంబిస్తున్న ద్వంద ప్రమాణాలను, పక్షపాత ధోరణిని ఎత్తి చూపించామన్నారు విజయసాయి రెడ్డి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి అందిన కాడికి అమ్మేయడం తగదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం నిధులు సైతం ఉద్దేశపూర్వకంగా కేంద్రం విడుదల చేయడం లేదని విజయసాయి రెడ్డి విమర్శించారు.
Read More: Huzurabad By Poll: ఈటల సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు..!ఇది ఒక వ్యూహమా..!?
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పుదుఛ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. అదే విధంగా తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,112 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కోరారు. సీఆర్డీఏ, ఫైబర్ నెట్, అంతర్వేధి రథం దగ్ధం ఘటనలపై సీబీఐ దర్యాప్తును కోరడం జరిగిందన్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంపై కేంద్ర వైఖరి దుర్మార్ఘంగా ఉందనీ, శరద్ యావద్ విషయంలో నోటీసు ఇచ్చి వారం లోనే అనర్హత వేటు వేసిన స్పీకర్ తాము పిటిషన్ ఇచ్చిన 11 నెలల తరువాత స్పందిస్తారా అని ప్రశ్నించారు. కావాలనే కాలయాపన చేసి ఇప్పుడు పిటిషన్ లో తప్పులు ఉన్నాయని అంటున్నారని విమర్శించారు. అనర్హత పిటిషన్ పై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందనీ, సుప్రీం మార్గదర్శకాల మేరకు చట్టంలో మార్పులు తేవాలని కోరామన్నారు. నేడు విజయసాయి రెడ్డి కేంద్రంలోని బీజేపీపై మాట్లాడిన మాటల తీరును చూస్తే రేపటి నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.