CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనను ఇప్పటి వరకూ ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహనరెడ్డిని విమర్శిస్తూనే ఉన్నారు.. అయితే సీఎం జగన్మోహనరెడ్డికి ఇప్పుడు తాజాగా తన తండ్రి సహచరులుగా వ్యవహరించిన నేతల నుండి విమర్శలు ఎదురుకావడం విశేషం. ఇటీవలే వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చేస్తున్న అప్పులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు అధికార పక్షం నుండి సరైన కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు. ఇదిలా ఉంటే సీఎం వైఎస్ జగన్ ఉహించని విధంగా ఆయన సొంత జిల్లా నుండే తిరుగుబాటు మొదలైంది. వైఎస్ సమకాలికుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జగన్మోహనరెడ్డి సర్కార్ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
CM YS Jagan: జగన్ సర్కార్ పై డీఎల్ ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన డీఎల్ రవీంద్రారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్మోహనరెడ్డితో పాటు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నరేళ్ల పాటు సైలెంట్ గా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి నేడు జగన్ సర్కార్ పై విమర్శలు చేయడంతో వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. మంత్రులు, సలహాదారులు, అవినీతి, రైతు సమస్యలను ఇలా పలు అంశాలను లేవనెత్తి విమర్శలు సంధించారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన డీఎల్ .. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనన్నారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ది వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంక్షోభంలో వ్యవసాయ రంగం
రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయిందనీ, రైతులను పట్టించుకునే నాధుడే కరువైయ్యారన్నారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖలో సలహాదారు పదవి ఇచ్చారని ఆరోపించారు,. తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతారని అన్నారు. ఏపిలో ప్రస్తుతం పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వారు కరువైయ్యారన్నారు. తన సొంత పొలాన్నే కౌలుకు తీసుకునే నాధుడే లేడని అన్నారు. సొంత ఖజానాను నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారని డీఎల్ విమర్శించారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించిన మీడియా సమావేశాలను నిర్వహించడం లేదనీ, దారినపోయే వారందరూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారని సజ్జలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యం పంపిణీపైనా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యంను 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారన్నారు. బియ్యం సబ్సిడీ ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుండి తొలి సారి గా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా విజయం సాధించిన డీఎల్ రవీంద్రారెడ్డి తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.