Konijeti Rosaiah: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపాలు తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసిఆర్, రాజకీయ, సినీ ప్రముఖులు అనేక మంది సంతాపం తెలియజేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, నేతలు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకుని రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. రోశయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని నేతలు, ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు.
Konijeti Rosaiah: తెలుగు ప్రజలకు తీరనిలోటు
రోశయ్య మృతి పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న సీజే జస్టిస్ ఎన్వీ రమణ రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా దక్షుడిగా రోశయ్య పేరు గాంచారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని, తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించే వారని అన్నారు. విలువలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తుల్లో రోశయ్య ఒకరని అన్నారు. తెలుగు భాషకు, సంస్కృతికి, కళలకు పెద్ద పీట వేశారనీ, రోశయ్య మరణం తెలుగు ప్రజలందరికీ తీరని లోటని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి 12.30 గంటల వరకూ గాంధీ భవన్ లో ఉంచనున్నారు. అనంతరం కొంపల్లి ఫాం హౌస్ లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Konijeti Rosaiah: ఏపి, తెలంగాణలో మూడు రోజుల సంతాప దినాలు
మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు సంతాప దినాలు ప్రకటించాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా పాటించనున్నట్లు ప్రకటించాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య ఈ రోజు లో బీపీ కారణంగా అస్వస్థతకు గురై కన్నుమూశారు.