Rahul Gandhi: కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులను వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తానికి తాను ఇచ్చిన సలహాను కేంద్రం పాటించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. “బుస్టర్ డోసులు వేయాలన్న నా సలహాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అది సరైన నిర్ణయం, వ్యాక్సిన్ బూస్టర్ డోసులు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందించాల్సిన అవసరం ఉంది” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం రాహుల్ గాంధీ దేశంలో వ్యాక్సినేషన్ పై ఓ ట్వీట్ చేశారు. “చాలా మందికి ఇంకా వ్యాక్సిన్లే వేయలేదు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసులు ఇంకెప్పుడు వేస్తుంది” అని ప్రశ్నిస్తూ ఈ నెల 22న ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ పై ప్రధాన మంత్రి మోడీ స్పందించారో లేక ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం మంచి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే ఇతర దేశాల్లో బూస్టర్ డోసుల పంపిణీ జరుగుతోంది.
Rahul Gandhi: జనవరి 3వ తేదీ నుండి 15 – 18 ఏళ్ళ వారికి
భారతదేశంలో బూస్టర్ డోస్ ల పంపిణీ గురించి నిన్నటి వరకూ కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. నిన్న రాత్రి ప్రధాన మంత్రి మోడీ అకస్మాత్తుగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని మాస్క్ లు ధరించాలని, శానిటైజర్ లు వాడాలని సూచించారు. జనవరి 3వ తేదీ నుండి 15 – 18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ లు వేయడంతో పాటు పదవ తేదీ నుండి ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధుల (వైద్యుల సూచనల మేరకు)కు బూస్టర్ డోసులు వేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం విదితమే. మరో పక్క భారత్ బయోటెక్ పిల్లల టీకా కోవాగ్జిన్ కు భారత ఔషద నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది.