CPI Narayana: ఏపిలో రివర్స్ పిఆర్సీపై ఉద్యోగులు ఆందోళనకు సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. నూతన పీఆర్సీ జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంలో ఉపాద్యాయులను అరెస్టు చేశారు. ఉపాధ్యాయులపై పోలీసులు దాడి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి దాసరి నారాయణ రావు స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఘాటు పదజాలంతో విమర్శించారు.
“చిత్తూరులో చదువుల తల్లులపై విపరీతంగా దాడి చేస్తున్నారు. నిరంకుశత్వంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అక్షరాశ్యతపైనా, మేధావులపైనా, ఉపాధ్యాయులపైనా దాడి చేసే హక్కు మీకు ఎక్కడిది. వారు ఏమైనా కొత్తగా అడుగుతున్నారా..? వాళ్లకు రావాల్సినవే అడుగుతున్నారు. వాళ్లు అనుభవించే హక్కునే అడుగుతున్నారు. వాళ్లకు కావాల్సిన హక్కు కోసం అడుగుతుంటే మీకు హక్కే లేదని అంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి చెబుతున్నారు. అయిదు విడతల డీఏలను పేరబెట్టుకుని దాన్ని ఒక్కసారిగా ఇచ్చి ఫిట్ మెంట్ 23 శాతంకు తగ్గించి, హెచ్ఆర్ఏ 50 శాతం తగ్గించి మేము డబ్బులు ఇచ్చామని చీఫ్ సెక్రటరీ చెప్పాడంటే.. ఆ చీఫ్ సెక్రటరీ చదువుకున్నాడా..? చదువులేని మూర్ఘుడా..? అలా మాట్లాడతారా..? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక పక్క డబ్బులు లేవంటారు. సలహాదారులను వరుసపెట్టి అపాయింట్ చేసుకుంటారా..? ఒక్కో సలహాదారుడు అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుంటాడా..? వాళ్లు పనీ పాటా చేయరా..? నిన్న కాక మొన్న కూడా ఆపాయింట్ చేసుకున్నారు. డబ్బులేమో ఇలా విలాసవంతంగా ఖర్చు పెడతారు. వీళ్లకు ఇవ్వాల్సిన వేమో ఇవ్వరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలానే జరిగితే రేపు ఎన్జీవో లోని అన్ని సంఘాలు ఏకం అవుతున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు కొనసాగిస్తారు దానికి భారత కమ్యూనిస్టు పార్టీ సపోర్టు చేస్తుంది” అని నారాయణ పేర్కొన్నారు.