మోదీ విజయానికి కళ్యాణ్ సింగ్ పిలుపు
అది ఉల్లంఘనేనన్న ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాల్సిందేనంటూ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని, దీన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. సాధారణంగా గవర్నర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇంతకుముందు ఒకసారి 90లలో నాటి హిమాచల్ గవర్నర్ గుల్షర్ అహ్మద్ దన కొడుకు సయీద్ అహ్మద్ కోసం మధ్యప్రదేశ్ లో ప్రచారం చేశారు. అది కోడ్ ఉల్లంఘన అని తేలింది. తన కొడుకు ప్రచారం కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఈసీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
కళ్యాణ్ సింగ్ అలీగఢ్ లో విలేకరులతో మార్చి 23న మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మోదీ గెలవాలనే కోరుకుంటున్నారని, అది దేశానికి అవసరమని ఆయన అన్నారు. తామంతా బీజేపీ కార్యకర్తలమేనని, అందుకే బీజేపీ గెలవాలని అనుకుంటున్నామని చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని కావడం సమాజానికి కూడా అవసరమని అన్నారు. అలీగఢ్ నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ సతీష్ గౌతమ్ పేరు ప్రకటించడంతో కొందరు పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. వారిని సముదాయించేందుకు ఆయనలా అన్నారు. యూపీ ప్రధాన ఎన్నికల అధికారి దీనిపై అధికారులను వాస్తవాలేంటో చూడాలని కోరారు.