కమిషనర్ల మీద ఫిర్యాదులపై విచారణాధికారం
అధికారం కావాలని కోరుతున్న కేంద్రప్రభుత్వం
కుదరదని చెబుతున్న సమాచారహక్కు చట్టం
న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవస్థల ధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటైన కేంద్ర సమాచార కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కానీ దానిమీద కూడా పెత్తనం చలాయించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర సమాచార కమిషనర్ సహా సమాచార కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల విచారణకు ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో ప్రచురించింది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని సీఐసీకి గత నెలలో లేఖ రాసింది. సిబ్బంది వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ దీనిపై సంతకం చేశారు.
సీఐసీపై ఫిర్యాదులు అందుకుని, విచారించడానికి ఒకటి.. సమాచార కమిషనర్లపై ఫిర్యాదులకు మరొకటి రెండు కమిటీలు వేయాలన్నది ప్రభుత్వ యోచన. మొదటి కమిటీలో కేబినెట్ కార్యదర్శి, డీఓపీటీ కార్యదర్శి, రిటైరైన సీఐసీ ఉంటారు. రెండో కమిటీలో కేబినెట్ సెక్రటేరియట్ లోని సమన్వయ కార్యదర్శి, డీఓపీటీ కార్యదర్శి, రిటైరైన సీఐసీ ఉంటారు. రెండింటిలో ప్రభుత్వాధికారులదే పైచేయి అవుతుంది. సమాచార కమిషనర్ల పనిపై రాజకీయ ప్రభావం చూపడానికే ఈ ప్రతిపాదన చేశారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. దీనివల్ల పారదర్శకతకు పెద్దపీట వేసే వ్యవస్థకు స్వతంత్రం పోతుందని అన్నారు. కమిషన్ పై ప్రభుత్వ ఒత్తిడి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సమాచార కమిషనర్లపై ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఎవరైనా కమిషనర్లపై ఫిర్యాదు వస్తే ప్రధాన కమిషనర్ చూస్తారు, ఆయనపైనే వస్తే ఉన్న కమిషనర్లందరూ చూస్తారు. డీఓపీటీ ప్రతిపాదనలపై ప్రధాన కమిషనర్, ఐదుగురు కమిషనర్లు మార్చి నెలాఖరులో చర్చించినట్లు సమాచారం. దాన్ని అందరూ వ్యతిరేకించారు. ప్రతిపాదనకు సంబంధించిన న్యాయ, సాంకేతిక, పాలనాపరమైన అంశాలన్నీ పరిశీలించి అప్పుడు వివరంగా నోట్ పంపాలని భావిస్తున్నట్లు పేరు వెల్లడించని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కేంద్ర సమాచార కమిషనర్లు, ప్రధాన కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంటుంది. వారందరినీ రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ ప్రతిపాదనలు ఇస్తుంది. కమిషనర్లు ఎవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలితే సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి మాత్రమే వారిని తొలగించగలరు. ఈ విషయం ఆర్టీఐ చట్టం సెక్షన్ 14(1)లో ఉంది. ఎవరైనా కమిషనర్ దివాలా తీసినా, వేరే ఉద్యోగం చేసినా, శారీరక.. మానసిక అనారోగ్యం కారణంగా ఉద్యోగం చేయడానికి తగినంత సామర్ధ్యం లేకపోయినా రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు. ఈ విషయం ఆర్టీఐ చట్టం సెక్షన్ 14(3)లో ఉంది.