Cine Actor Ali: ప్రముఖ సినీ హాస్య నటుడు, వైసీపీ నేత ఆలీకి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతుంది అని నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినీ పరిశ్రమ సమస్యలపై నిన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో జరిగిన బేటీలో చిరంజీవి తదితర సినీ ప్రముఖులతో పాటు ఆలీ కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన తరువాత వీరంతా వెళ్లే సమయంలో ఆలీతో వారం తరువాత కలుద్దాం అని సీఎం జగన్ అన్నారని ప్రచారం జరుగుతోంది. కలుద్దాం అని అన్నారు అంటే త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో మైనార్టీ కోటాలో ఆలీకి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు అన్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆలీకి రాజ్యసభ ఇస్తారా..? ఇవ్వారా.. ? రాజ్యసభ ఇవ్వడానికి కారణాలు ఏమిటి…? ఒక వేళ్ల ఇవ్వకపోతే దానికి గల కారణాలు ఏమిటి.. ?అనేది విశ్లేషించుకుంటే..
ఒక రాజ్యసభ స్థానం బీజేపీకి లేదా ఆదానీ వ్యక్తికి..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు కొత్తగా రాబోతున్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల పదవీ కాలం జూన్ తో ముగియనుంది. ఈ నాలుగు వైసీపీకే వస్తాయి. విజయసాయి రెడ్డికి మళ్లీ రెన్యూవల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన మూడు రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక రాజ్యసభ స్థానం బీజేపీకి (సురేష్ ప్రభు) ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక స్థానం బీజేపికి ఇస్తారు. గతంలోనూ పరిమళ్ నత్వానికి ఇచ్చారు. బీజేపీ సిఫార్సు మేరకే పరిమళ్ నత్వానికి ఏపి నుండి రాజ్యసభ స్థానం ఇచ్చారు. ఈ రాష్ట్రం తరుపున వైసీపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నా ఇటు రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఆయన ఎంత మేరకు ఉపయోగపడుతున్నారు అనేది అందరికీ తెలిసిందే. అంబానీ శిష్యుడైన పరిమళ్ సత్వానికి గతంలో ఇచ్చినందున ఇప్పుడు ఆదానీ తరపు వ్యక్తులకు రాజ్యసభ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఒకటి మైనార్టీకి, ఒకటి బీసీకి
మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మైనార్టీకి, ఒకటి బీసీకి ఇవ్వాలని సీఎం జగన్ అనుకుంటున్నారనేది వైసీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. బీసీ వర్గాల నుండి నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మస్తాన్ రావు పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఎందుకంటే ఆయన టీడీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ నుండి ఓడిపోయిన తరువాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరే సమయంలోనే రాజ్యసభ లేదా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేదా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిళ్లి కృపారాణికి ఇస్తారు అని మరొక టాక్ ఉంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పని చేశారు. మంచి పరిచయాలు ఉన్నాయి. బీసీ సామాజికవర్గంతో పాటు మహిళ కోటాలో ఆమెకు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ఉన్న చర్చ.
మైనార్టీ కోటాలో ఆలీ పేరు
ఇక మైనార్టీ కోటాలో ఆలీ పేరు వినబడుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. పదవులు ఇచ్చే విషయంలో జగన్మోహనరెడ్డి చాలా ఆచిచూసి వ్యవహరిస్తారు. పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు జగన్. ఎదో ఎన్నికల ముందో, ఎన్నికల తరువాతో పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే చాలా మందికి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆలీ 2019 ఎన్నికలకు ముందు మాత్రమే వైసీపీలో చేరారు. 2011 నుండి వైసీపీ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆలీ 2014 ఎన్నికల్లో టీడీపీలో పని చేశారు. చాలా కీలకంగా ప్రచారం కూడా చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తాను అడిగిన రాజమండ్రి సీటు ఇవ్వలేదని అలిగి ఆలీ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మోహన్ బాబు,. హేమ, రాజశేఖర్, జీవిత రాజశేఖర్, పృద్విరాజ్ ఇలా చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్లందరి కంటే ముందే పోసాని కృష్ణమురళి వైసీపీలో ఉన్నారు.
ఫిలిమ్ డవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి అయితే ఖాయమే..?
ఆలీకి రాజ్యసభ ఇస్తే అటు మోహన్ బాబు, పోసాని కృష్ణమురళి, జీవితా రాజశేఖర్ ల పరిస్థితి ఏమిటి. వీరు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఆలీతో పాటుగా వీరు వైసీపీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. మైనార్టీ కోటాలో ఆలీకి ఇస్తారని అనుకుంటున్నారు కానీ మైనార్టీ కోటాలో వైసీపీ నుండి పది మంది నాయకులు ఉన్నారు. ఇటీవల కొయ్యే మోషేన్ రాజుకు శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన 2011 నుండి వైసీపీలో ఉన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ గా రెండు సార్లు పని చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసులు ఎదుర్కొన్నారు మోషేన్ రాజు. ఇలా పార్టీలో మొదటి నుండి కష్టపడిన వారికి రాజ్యసభ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన మైనార్టీ నేతలు చాలా మంది ఉన్నారు. ఆలీకి రాజ్యసభ కాకపోయినా ఎమ్మెల్సీ గానీ లేక ఫిలిమ్ డవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ లాంటి నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఆలీకి ఏ పదవి వరించనున్నదో..