AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ప్రారంభం నుండే రాజకీయ వాతావరణం హీటెక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల గడువు 2024 వరకూ ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు షికారు చేస్తుండటంతో రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు, ఇన్ చార్జిలు యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జనంలో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీి ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో జనాల్లోకి రాలేదు. ఈ పార్టీ ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల మీద ఆధారపడుతోంది తప్ప, తాము ఈ తప్పులు సరిదిద్దుకున్నాం, బలం పెంచుకున్నాం అంటూ పూర్తి స్థాయిలో జనంలో తిరిగింది ఏమీ లేదు. ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడింది ఏమి లేదు.
AP Politics: వైసీపీ ప్లీనరీ కి ప్రశాంత్ కిషోర్..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ (పీకే) వెన్నెముక అని చెప్పవచ్చు. ఆయన టీమ్ ఇప్పటికీ వైసీపీకి అనుబంధంగా పని చేస్తోంది. నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పీకే తిరుగుతూ నెలవారీ నివేదికలను వైసీపీ అధిష్టానానికి అందిస్తోంది. ప్రభుత్వ పని తీరు మీద, ప్రభుత్వ పథకాల అమలుపైనా, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది. ఎమ్మెల్యేల పని తీరు ఇలా భిన్నమైన అంశాల మీద ప్రతి నెలా పీకే టీమ్ నుండి రిపోర్టులు వస్తుంటాయి. పీకే నేరుగా 2019 ఎన్నికల తరువాత తెరమీదకు రాలేదు. జూలై 7,8 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగబోతున్నది. దాదాపు అయిదు సంవత్సరాల క్రితం 2017లో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీలోనే ప్రశాంత్ కిషోర్ ను వైఎస్ జగన్ పార్టీ వ్యూహకర్తగా వైసీపీ నేతలు, శ్రేణులకు పరిచయం చేసారు. ఆ ప్రశాంత్ కిషోర్ అయిదేళ్ల తరువాత మళ్లీ తెరమీదకు తీసుకువచ్చేందుకు వైసీపీ సిద్ధం అవుతోందని సమాచారం.
AP Politics: మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్..?
మరో పక్క టీడీపీలోనూ బ్లాస్టింగ్ అంశం ఉంది. వైసీపీ వ్యూహకర్త పీకే, జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా పోల్చడం కుదరదు కానీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఒక బూస్ట్ గా టానిక్ గా ఉపయోగపడతారు. ప్రశాంత్ కిషోర్ కనిపిస్తే వైసీపీ శ్రేణులకు ఒక ధీమా ఉన్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే ఆ పార్టీ శ్రేణులకు ఒక నమ్మకం, ఒక ధైర్యం వస్తుంది. నందమూరి కుటుంబం మొత్తం ఒకటిగా ఉంది. ఎన్టీఆర్ కూడా తమతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ ఆ పార్టీలో ఏర్పడుతుంది. ఆయన ప్రచారం చేసినా చేయకపోయినా టీడీపీ వేదికపై ఆయన కనిపిస్తే చాలు అనుకుంటారు. అందుకు మే 28,29 తేదీల్లో జరిగే మహానాడు వేదిక మీద ఎన్టీఆర్ ను చూపించడానికి టీడీపీ సిద్ధం అవుతుంది. ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున కొంత మంది ప్రతినిధి బృందాన్ని ఆయన వద్దకు పంపాలని నిర్ణయించారు. నందమూరి ఫ్యామిలీలో అందరినీ ఆహ్వానిస్తారు.
ఎన్టీఆర్ కీ టీడీపీకి పరీక్ష
చంద్రబాబు మీద చాలా కాలంగా ఒత్తిడి ఉంది. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లినప్పుడే కొంత మంది పార్టీ అభిమానులు ఎన్టీఆర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఆ తరువాత అనేక చర్చల్లో ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ మద్య కాలంలో వల్లభనేని వంశీ భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ పై ఎన్టీఆర్ సరిగా స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కీ రావాలా వద్దా..? అనేది ఒక పరీక్ష. ఇటు టీడీపీకి ఒక పరీక్ష. మహానాడు వేదికకు వచ్చి ఎన్టీఆర్ మాట్లాడి వెళితే టీడీపీ శ్రేణులకు ఒక ధైర్యం. ఆయన వచ్చినంత మాత్రాన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయనో, పార్టీ బలోపేతం అవుతుందనో కాకపోయినా కార్యకర్తల్లో ఒక ఊపు వస్తుందని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వైసీపీ ప్లీనరీలో పీకే పాల్గొనడం, ఇటు మహానాడు వేదికపై ఎన్టీఆర్ హజరుకావడం ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి.