YSRCP: పార్టీలో క్రమశిక్షణ మీరితే ఏ స్థాయి వ్యక్తిపై అయినా వేటు వేస్తామని సంకేతం ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేయడమైందని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిపార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP: సుబ్బారాయుడు రాజకీయ ప్రస్థానం
కొత్తపల్లి సుబ్బారాయుడు 1984 నుండి 89 వరకు నరసాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత టీడీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపిగా విజయం సాధించారు. 1994 -95లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, 1999-2004 మధ్య విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తరువాత మెగాస్టార్ చిరంజీవితో ఉన్న పరిచయం మూలంగా ఆ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత చిరంజీవితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కొత్తపల్లి ఆ ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ టీడీపీలో చేరారు. కాపు కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ముదునూరి ప్రసాదరాజు గెలుపునకు సుబ్బారాయుడు కృషి చేశారు.
YSRCP: ఎమ్మెల్యే ప్రసాదరాజుపై బహిరంగంగా విమర్శలు
అయితే జిల్లాల పునర్విభజన చేస్తున్న సమయంలో సుబ్బారాయుడు నర్సాపురం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయాలని ఉద్యమం నడిపారు. ఆ సందర్భంలో జరిగిన ఓ సభలో సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుని ప్రభుత్వానికి నిరసన కూడా తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై బహిరంగంగా సుబ్బారాయుడు విమర్శలు చేయడాన్ని సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారు. ఆ సందర్భంలో సుబ్బారాయుడుపై కేసు కూడా నమోదు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం ఆయనకు ఉన్న గన్ మెన్ సౌకర్యాన్ని తొలగించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి పేర్ని నాని సుబ్బారాయుడును హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం
తాజాగా సుబ్బారాయుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత ఎన్నికల్లో ప్రసాదరాజును నర్సాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు మద్దతు ఇచ్చి పెద్ద పొరపాటు చేశాననీ, ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ నర్సాపురం జిల్లా కేంద్రంగా చేయాలనే పోరాటంలో కలిసిరాలేదని అన్నారు. కనీసం ప్రభుత్వం ఒత్తిడి కూడా చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన (ప్రసాదరాజు) ఎక్కడ నుండి పోటీ చేస్తారో తనకు తెలియదు, నేను మాత్రం పోటీ చేస్తా, పార్టీ కంటే వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తనకు బలం ఉంది అన్నట్లుగా సుబ్బారాయుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనపై వేటు వేసింది. వైసీపీ నుండి సస్పెండ్ అయిన నేపథ్యంలో సుబ్బారాయుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరతారా లేక జనసేన వైపుకు చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.