Breaking: ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యుఎస్)కు ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ దర్మాసనం.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
ఉన్నత వర్గాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2019 ఫిబ్రవరి 1న చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా వార్షిక ఆదాయం రూ.8లక్షలలోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణ పేదలకు ఉపయోగం కల్గింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనహిత్ అభియాన్ అనే సంస్థ 2019లో ఓ పిటిషన్ దాఖలు చేయగా, ఆ తర్వాత మరో 40 పిటిషన్లు సుప్రీం కోర్టుకు వచ్చాయి. పిటిషన్ల తరపున అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం సముచితమేనని అభిప్రాయపడింది.