Pawan Kalyan: ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ఇంతకు ముందు తెలంగాణ, ఏపిలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. వాహనం సిద్దం చేసుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటించకపోవడంపై వైసీపీ శ్రేణులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్నందున చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని పవన్ జనాల్లోకి రావడం లేదంటూ ఆ పార్టీ శ్రేణులు ఇంతకు ముందు విమర్శలు గుప్పించారు. వారాహిలో వచ్చే పవన్ కోసం అభిమానులు, జనసైనికులు, వీరనారీమణులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చేశారు.
జనాల్లోనే అన్ని పార్టీలు
ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్నప్పటికీ ఒ పక్క అధికార వైసీపీ ఇంటింటికి మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు జనాల్లో తిరుగుతూ ఉన్నారు. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి టీడీపీ మరో కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుండి ప్రజల్లోకి వస్తారని ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో ప్రచారం చేయడంపై ఇవేళ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమైయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ యాత్రపై సమావేశంలో చర్చించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఇప్పటికే రూట్ మ్యాప్ ను సిద్దం చేసింది పార్టీ.
జూన్ 14 నుండి జనంలోకి జనసేనాని
ఈ నెల 14వ తేదీ నుండి వారాహి పై పవన్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలుత ఉభయ గోదావరి జిల్లాలో యాత్ర జరగనున్నది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లుగా తెలిపారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేలా పవన్ యాత్ర జరుగుతుందని తెలిపారు. అన్నవరం నుండి వారాహి యాత్ర ప్రారంభిస్తారని మనోహర్ చెప్పారు. యాత్రలో భాగంగా ప్రతి రోజు ఓ పీల్డ్ విజిట్ ఉంటుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులు యాత్ర నిర్వహించేలా షెడ్యుల్ సిద్దం చేశామని చెప్పారు. వారాహి యాత్రకు పవన్ సిద్దం కావడంతో ఆ పార్టీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక 12 రోజుల్లో తమ నేత ప్రజల్లోకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పవన్ అభిమానులు.
Balineni: సీఎం జగన్ తో భేటీ తర్వాత బాలినేని చేసిన కీలక కామెంట్స్ ఇవి