Tirumala: తిరుమల కాలిబాట మార్గంలో మరో చిరుత చిక్కింది. చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి తర్వాత టీటీడీ మరింత అప్రమత్తమైంది. భక్తులపై చిరుతల దాడిని నియంత్రించేందుకు టీటీడీ అనేక చర్యలు చేపట్టింది. టీటీడీ అధికారులు అటవీశాఖ అధికారుల సమన్వయంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా చిక్కిన చిరుతతో ఇప్పటి వరకూ తిరుమల నడక మార్గంలో ఆరు చిరుతలను బంధించారు. బుధవారం వేకువ జామున లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు చెప్పారు.
చిన్నారి లక్షిత దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కింది. పట్టుబడిన చిరుతను జూపార్క్ తరలించడానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వరుసగా తిరుమల నడక మార్గంలో చిరుతలు సంచరిస్తూ అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుతుండటం భక్తులను ఆందోళన గురిచేస్తొంది. ఈ నేపథ్యంలోనే నడక మార్గంలో వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ పలు చర్యలు చేపట్టింది. భక్తులకు కర్రలు అందించడంతో పాటు వారికి రక్షణగా భద్రతా సిబ్బందిని పంపుతున్నారు.
చిరుత చిక్కిన ప్రాంతాన్ని బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారి లక్షిత పై చిరుత దాడి చేసిన తర్వాత టీటీడీ అనేక చర్యలు చేపట్టిందన్నారు. నడక దారిలో భక్తుల భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు అన్నీ ఆమలు చేస్తున్నామని తెలిపారు. నడక దారిలో భక్తులకు కర్రలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తామని తెలిపారు. నడక దారిలో కంచె వెయ్యడమా లేక ఇతర చర్యలపై ఆలోచన చేస్తున్నామన్నారు.
భక్తుల భద్రతపై తాము ఎంత చిత్తశుద్దితో ఉన్నాము అనే దానికి ఈ చర్యలే ఉదాహరణ గా పేర్కొన్నారు. గత దాడి నేపథ్యంలో యాత్రికుల భద్రతకు ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. విమర్శలు చేసే వారికి కనువిప్పు కలగాలన్నారు. టీటీడీ చేపట్టిన చర్యల కారణంగానే ఆరవ చిరుతను బంధించడం జరిగిందన్నారు. అటవీ సిబ్బంది రేయింబవళ్లు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. క్రూరమృగాల సంచరంపై నిరంతరం అధ్యయనం జరుగుతుందని ఆయన తెలిపారు.
దీనిపై డీఎఫ్ఓ మాట్లాడుతూ ఇవేళ వేకువజామున చిరుత బోన్ లో చిక్కిందన్నారు. బోనులో చిక్కిన చిరుత వయసు సుమారు నాలుగు సంవత్సరాలు ఉంటుందన్నారు. వైద్య పరీక్షల అనంతరం చిరుతను సుదూర అటవీ ప్రాంతంలో వదలాలా లేదా అన్నది నిర్ణయిస్తామన్నారు. బోన్ లో చిక్కిన ఆరు చిరుతల్లో రెండు మూడు చిరుతలకు దంతాలు సరిగ్గాలేవు అని, వాటికి వేటాడే శక్తి తక్కువగా ఉంటుందని కావున అలాంటి వాటిని జూ పార్క్ సంరక్షణ చేస్తామని ఆయన తెలిపారు.
Chandrababu ACB Court: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!