100 కార్లు దోచిన దొంగ అరెస్టు
బొమ్మ తుపాకితో హడావుడి
న్యూఢిల్లీ: అది దేశ రాజధాని ప్రాంతం. బుధవారం రాత్రి మారుతి బ్రీజా కారులో ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా వారిని పోలీసులు చుట్టుముట్టారు. కారు నడుపుతున్న వ్యక్తి కునాల్ (40). దాదాపు 20 ఏళ్లుగా సుమారు 100 వరకు కొత్త కార్లను దొంగిలించిన కేసులో ప్రధాన నిందితుడు. అతడు పోలీసులకు లొంగిపోవడానికి ఇష్టపడలేదు. కారు రివర్స్ చేసి, పోలీసు వ్యానును ఢీకొట్టాడు. ముగ్గురు అధికారులను గాయపరిచాడు. అప్పుడు గానీ ఎస్ఐ రోహతాష్ కు పరిస్థితి అర్థం కాలేదు. గతంలో కునాల్ కొందరు పోలీసులపై కాల్పులు కూడా జరిపాడని ఆయన చెప్పారు. కునాల్ కారు దిగి, ఒక భారీ ఇనుప రాడ్ తీసుకుని ముగ్గురు పోలీసులను గాయపరిచాడు. తర్వాత ఒక పిస్టల్ తీసినా, రోహతాష్ అతడిని పట్టుకున్నారు. అదృష్టవశాత్తు అది బొమ్మ పిస్టల్ అని ఎస్ఐ చెప్పారు.
షాదరా జిల్లాకు చెందిన కార్ల దొంగల నిరోధ బృంతం కునాల్ తో పాటు అతడి అనుచరుడు షాహిద్ ను 100 కార్లకు పైగా దొంగతనం చేసినందుకు అరెస్టుచేశారు. కునాల్ రాత్రి పూట కార్ల దొంగతనాలు చేస్తూ పీసీఆర్ వ్యాన్లను కూడా తప్పించుకుని పోయేవాడని డీసీసీ మేఘనా యాదవ్ చెప్పారు. అతడిపై 21 కేసులు ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, పేరు, చిరునామా మార్చేసి అరెస్టు నుంచి అతడు తప్పించుకున్నాడు. ప్రస్తుతం భూతనాథ్ అనే పేరుతో చలామణి అవుతున్నాడు. అతడు కారు దొంగిలించడానికి ఐదే నిమిషాలు తీసుకుంటాడు. నల్ల ముసుగు, గ్లోవ్స్ ధరించి, విండ్ షీల్డు మీద సీరియల్ నంబర్లు చూడటం ద్వారా కార్లు దొంగిలిస్తాడు.
స్టీరింగ్ వీల్ లాకింగ్ వ్యవస్థలను నిరోధించడానికి అతడు బలమైన అయస్కాంతాలు వాడతాడని, తలుపులు తెరిచేందుకు ఇనప రాడ్లు వాడతాడని పోలీసులు చెప్పారు. వాహన భద్రత వ్యవస్థ పని చేయకుండా ఉండేందుకు ప్రీ కోడెడ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ కూడా అతడివద్ద ఉందట. కార్ల దొంగతనం ఎలా చేయాలో అతడు యూట్యూబ్ లో వీడియోలు కూడా పెట్టాడన్నారు. 2019 మోడల్ కార్లను కూడా అతడు దొంగిలించాడని యాదవ్ తెలిపారు. అతడి వద్ద నుంచి కార్లు ఎవరు కొనేవారో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులున్నారు.